– ఈ నెల 18న చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేలా ఉత్సవాలు
– విజయవాడ బాపూ మ్యూజియంలో ప్రత్యేక కార్యక్రమాలు
– ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయండి
– వారసత్వ సంపదకు నెలవైన మ్యూజియాల విశిష్టతను చాటిచెప్పండి
– మీడియా సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవ్య రాజధాని అమరావతికి గేట్ వే అయిన విజయవాడ ప్రాంతంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేయడం జరుగుతోందని.. ఇందులో భాగంగా ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం (International Museum Day) సందర్భంగా పండగలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. పర్యాటక, ఆర్కియాలజీ శాఖలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ కమిటీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ గురువారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ కార్యక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారసత్వ సంపదను సంరక్షిస్తూ సంస్కృతిని సజీవంగా నిలిపే జ్ఞాన నిలయాలే మ్యూజియాలని.. గత వైభవాన్ని నేటి తరానికి, నేటి సంస్కృతిని రేపటి తరానికి అనుసంధానించే వారధులని పేర్కొన్నారు. ఇంతటి విశిష్టత కలిగిన మ్యూజియంల చారిత్రక వారసత్వ ప్రతీకలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మ్యూజియమ్స్ యునైటింగ్ ఏ డివైడెడ్ వరల్డ్ థీమ్తో ఈ ఏడాది అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుగుతుందన్నారు. 1887లో పునాది పడిన మన నగరంలోని బాపూ మ్యూజియాన్ని ఈ నెల 18న ఉచితంగా సందర్శించి, కార్యక్రమాల్లో భాగస్వాములు కావొచ్చన్నారు. రాష్ట్రంలో 14 వరకు పురావస్తు మ్యూజియాలు, మ్యూజియం క్షేత్రాలు ఉన్నాయని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
బాపూ మ్యూజియంలో రోజంతా ప్రత్యేకం:
ఈ నెల 18న ఉదయం బాపూ మ్యూజియంలో కల్చరల్ ఓపెనింగ్తో ప్రారంభమై మ్యూజియమ్స్ ఇన్ ది మోడర్న్ డేపై ప్రత్యేక చర్చలు, గైడెడ్ మ్యూజియం టూర్, విజయవాడ హెరిటేజ్ క్విజ్, దేశభక్తిని పెంపొందించేలా మ్యూజియంల విశిష్టతను చాటిచెప్పేలా లేజర్ షో వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. హెరిటేజ్ ఫొటోగ్రఫీ హంట్, పెయింటింగ్ పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానంతో పాటు సత్కరించనున్నట్లు తెలిపారు. సాయంత్రం ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో జరిగే రూట్స్ రీలోడెడ్ (Roots Reloaded) కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గాయని గీతా మాధురి బృందంతో పాటు బ్యాండ్ సెహారీ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఉంటుందని వెల్లడించారు.
అనుభవజ్ఞులు, యువత, విద్యార్థులు, వివిధ సంస్థలు, జర్నలిస్టులు.. ఇలా ప్రతిఒక్కరూ కార్యక్రమాల్లో భాగస్వాములై విజయవంతం చేయాలని, గౌరవ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఆర్కియాలజీ డీడీ ఎం.రామసుబ్బారెడ్డి, ఏడీలు వెంకటరావు, నరసింహనాయుడు, ఉత్సవ కమిటీ ప్రతినిధి వీఎం సుధర్మ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News