-అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా రాజధాని అమరావతి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలిచే ప్రపంచ స్థాయి నగరంగా . అమరావతి–2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS-2) రూపకల్పన పనుల పురోగతిపై అధికారులు, సింగపూర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రతినిధులు ప్రాజెక్టు పరిధి, అమలు ప్రణాళిక, దశలవారీ కార్యాచరణను ముఖ్యమంత్రికి వివరించారు. ఏరియా ప్లాన్, మౌలిక వసతుల ప్రణాళిక, పెట్టుబడి నమూనా వంటి అంశాలను ప్రాజెక్టులో భాగం చేస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగాలు కల్పించేలా అమరావతి ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కావాలని సీఎం సూచించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లతో అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నామని… ఎల్నినోతో సమస్య తలెత్తినా… పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా నదికి తీసుకురావడంతో రాజధాని ప్రాంతం జల వనరులతో కళకళలాడుతోందని చెప్పారు. అమరావతిని ఆర్ధికంగా బలోపేతం చేసేలా క్రియేటివ్ సిటీ నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. గ్లోబల్ బెంచ్ మార్కింగ్ చేరుకోవడం, అత్యధిక తలసరి ఆదాయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్ విధానంతో పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమీక్షకు మంత్రి పి.నారాయణ, పురపాలక, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శులు సురేశ్ కుమార్, పీయూష్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News