విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతిని పురస్కరించుకుని ఇండియా స్పేస్ ల్యాబ్ ప్రతి సంవత్సరం ఆగస్టు 12న జాతీయ రిమోట్ సెన్సింగ్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
దేశ అభివృద్ధి, సహజ వనరుల నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తు నివారణ వంటి రంగాల్లో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి సమర్థవంతంగా వినియోగించడంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ చేసిన దూరదృష్టితో కూడిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఆయన జన్మదినాన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విపత్తు సంసిద్ధత, పర్యవేక్షణ, అంచనా, ప్రతిస్పందన మరియు సుస్థిర అభివృద్ధిలో భౌగోళిక సాంకేతికతల పాత్రపై అవగాహన పెంపొందించడంతో పాటు జ్ఞానాన్ని విస్తరించే లక్ష్యంతో “విపత్తు నిర్వహణ కోసం రిమోట్ సెన్సింగ్ మరియు GIS” అంశంపై ఆన్లైన్ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, ప్రభుత్వ అధికారులు, విపత్తు నిర్వహణ నిపుణులు మరియు ఇతర ఆసక్తి గల భాగస్వాములను దృష్టిలో ఉంచుకుని ఈ వర్క్షాప్ను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. ఇందులో రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (GIS), పర్యావరణ పరిశీలన సాంకేతికతలు, జియో ఏఐ (Geo AI), డ్రోన్ మ్యాపింగ్, మెషిన్ లెర్నింగ్ అనువర్తనాలు, అలాగే వాస్తవ ప్రపంచ విపత్తు నిర్వహణకు సంబంధించిన కేస్ స్టడీస్ వంటి పలు కీలక అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.
ఈ ఆన్లైన్ వర్క్షాప్ను 2026 ఆగస్టు 12న నిర్వహించనున్నట్లు తెలిపారు. పాల్గొనదలచిన వారు రూ. 270 నమోదు రుసుము చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు ప్రక్రియ 2026 జూన్ 10 నుంచి జూలై 30 వరకు కొనసాగుతుందని, ఆసక్తి గల వారు https://isl.ac.in/workshop/ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.వర్క్షాప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఇ-సర్టిఫికేట్ అందజేయనున్నట్లు ఇండియా స్పేస్ ల్యాబ్ డైరెక్టర్ వెల్లడించారు.
Prajavartha Online Telugu News