-ఆక్వా, నాన్ ఆక్వా ప్రాంతంగా విడదీసింది జగన్ ప్రభుత్వమే
-కూటమి ప్రభుత్వం రాగానే అందరికీ విద్యుత్ సబ్సిడీ పునరుద్ధరించాం
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీ విధానాన్ని నిర్వీర్యం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆక్వా రైతుల గురించి మాట్లాడటం ఆశ్చర్యకరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఓ నోట్ ను విడుదల చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆక్వా ప్రాంతాన్ని ఆక్వా, నాన్ ఆక్వా జోన్లుగా విభజించి వేలాది మంది రైతులను విద్యుత్ సబ్సిడీకి దూరం చేశారని మంత్రి పేర్కొన్నారు. జగన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ విధానంతోనే ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానాన్ని సరిదిద్దుతూ అర్హులైన ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి ప్రతి అర్హులైన రైతన్నలకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న కూటమి ప్రభుత్వం వ్యవసాయ రైతులతో పాటు ఆక్వా రైతులు, చేనేత కార్మికులు, స్వర్ణకారులు, నాయి బ్రాహ్మణులకు కూడా విద్యుత్ సబ్సిడీలు అందిస్తోందని మంత్రి గొట్టిపాటి వివరించారు. వివిధ వర్గాల జీవనోపాధికి అండగా నిలిచేలా విద్యుత్ రాయితీలను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో విద్యుత్ రంగంతో పాటు ఆక్వా రంగం, ఇతర కీలక వ్యవస్థలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని మంత్రి ఆరోపించారు. ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం చేస్తూ జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న యాత్రలు, పర్యటనలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా రాజకీయ స్వలాభం కోసమేనని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News