అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక మాధ్యమాలలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు – ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎండీ శ్రీ పి. పుల్లారెడ్డి
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) నియామక ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలులో ఎటువంటి మార్పు లేదని సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి. పుల్లారెడ్డి స్పష్టం చేశారు.
ఏఈఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 30-06-2026 ఉదయం 10:00 గంటలకు ప్రారంభమై, 20-07-2026 రాత్రి 11:59 గంటల వరకు (మొత్తం 21 రోజులు) కొనసాగుతుందని తెలిపారు. ఈ షెడ్యూలులో ఎలాంటి మార్పులు లేవని, ఇదే అధికారిక షెడ్యూలు అమల్లో ఉందని స్పష్టం చేశారు.
ఏఈఈ నియామకాలకు సంబంధించి సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ గ్రూపులు, యూట్యూబ్ ఛానళ్లు మరియు ఇతర అనధికార వేదికలలో అసత్య వార్తలు,వదంతులు ప్రచారం అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అభ్యర్థులు ఇటువంటి తప్పుడు ప్రచారాలను విశ్వసించవద్దని ఆయన సూచించారు. నియామక ప్రక్రియకు సంబంధించిన అన్ని అధికారిక ప్రకటనలు APCPDCL అధికారిక వెబ్సైట్ మరియు అధికారిక సమాచార మాధ్యమాల ద్వారానే విడుదల చేయబడతాయని తెలిపారు.అలాగే, ఉద్యోగాలు ఇప్పిస్తామని, నియామకాల్లో సహాయం చేస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులు, మధ్యవర్తులు (దళారులు) పట్ల అభ్యర్థులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎండీ సూచించారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా, హామీలు ఇచ్చినా వాటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం మరియు ప్రతిభ ఆధారంగా మాత్రమే నిర్వహించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థులు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, ఏవైనా సందేహాలు ఉంటే APCPDCL అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత అధికారులను మాత్రమే సంప్రదించాలని సూచించారు.
Prajavartha Online Telugu News