– రాష్ట్రంలో పారిశ్రామిక వికాసం, ఉపాధి కల్పనే ధ్యేయం
– కేంద్ర ఎంఎస్ఎంఈ ఉన్నతాధికారులకు 9 కీలక విజ్ఞప్తులు
– నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్’ (NSIC) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు వినతి
– PMEGP ఆన్లైన్ పోర్టల్ రీ లాంచ్ చేయాలని విజ్ఞప్తి
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సాయంపై రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రి బుధవారం ఎంఎస్ఎంఈ గవర్న్మెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ భరత్ ఖేరా, ఎంఎస్ఎం భారత మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ & డవలప్మెంట్ కమిషనర్ డాక్టర్ రజనీష్ను కలిసి పలు అంశాలపై చర్చించడంతో పాటు పలు విజ్ఞప్తులు వీరి దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే మార్జిన్ మనీ సబ్సిడీ కేటాయింపులను పెంచాలని… ఉత్పత్తుల నాణ్యత, ధృవీకరణ (Certification) వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్రంలో కొత్త ఎంఎస్ఎంఈ టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యువ పారిశ్రామికవేత్తల తయారీకి, వారి నైపుణ్యాలను పెంచడానికి ఆంధ్రప్రదేశ్లో ‘నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్’ (NSIC) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నెలకొల్పాలని.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దరఖాస్తు ప్రక్రియ సులభతరం కావడానికి, పథకం వేగంగా అమలు కావడానికి కొత్త PMEGP ఆన్లైన్ పోర్టల్ను త్వరగా పునః ప్రారంభించాలని కూడా కేంద్రాన్ని మంత్రి కోరారు.
స్వయం ఉపాధి మరియు చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో లైవ్లీహుడ్ సెంటర్ల ఏర్పాటును వేగవంతం చేయడంతో పాటు ‘సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం’ (MSE-CDP) కింద ఎన్పీఏసీలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు తక్షణమే ఆమోదం తెలపాలని కూడా కోరారు. రాజమహేంద్రవరంలోని కొబ్బరి నార బోర్డు (Coir Board) వద్ద కాయిర్ బోర్డ్ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు కార్యాచరణ కోసం తగిన సమాచారం ఉండేలా… అక్కడ పక్కా డేటాబేస్ ఉండేలా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. అలాగే చేతివృత్తుల కళలను కాపాడుతూ, వారి ఉపాధి అవకాశాలను పెంచేందుకు ‘పీఎం విశ్వకర్మ’ పథకం కింద చేతివృత్తిదారుల కోసం ప్రత్యేకం జీవనోపాధి శిక్షణ కేంద్రాలను (Livelihood Training Centres) ఏర్పాటు చేయాలని కూడా మంత్రి విజ్ఞప్తి చేశారు. మంత్రితో పాటు ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో విశ్వమనోహర్ ఉన్నారు. మంత్రి కొండపల్లి ఎంఎస్ఎంఈ అంశాలపై కేంద్ర అధికారులతో జరిపిన చర్చల వివరాలను ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి వివరించారు.
Prajavartha Online Telugu News