– 1న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం
– ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ
– ఆరు జిల్లాల్లో 11,98,044 మంది లబ్ధిదారులు
– రు. 514.42 కోట్లు పంపిణీ
– మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆగస్టు 1న ప్రారంభిస్తోన్న నేపథ్యంలో ఏపీలో ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30న చేపట్టనున్నారు. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు ఆగస్టు 1వ తేదీన ప్రారంభిస్తున్నారని.. ఈ క్రమంలోనే లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండానే ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఈ ఆరు జిల్లాల్లో మొత్తం 11,98,044 మంది లబ్ధిదారులకు రు. 514.42 కోట్లను పంపిణీ చేస్తారని… పెన్షన్ల పంపిణీ కోసం అవసరమైన నగదు ఉపసంహరణ కార్యక్రమాన్ని ఈ నెల 29నే పూర్తి చేసేలా సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ నెల ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
Prajavartha Online Telugu News