– ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట ఏర్పాట్లు
– డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (విజయవాడ) కె.రామారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల (ఆర్ అండ్ ఎస్) శాఖ కమిషనర్ జరిపిన చర్చల కారణంగా దస్తావేజు లేఖరుల సంఘం పెన్డౌన్ కార్యక్రమాన్ని విరమించుకోవడంతో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు యథావిథిగా అందుతున్నాయని.. ఇదేవిధంగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోనూ అంతరాయం లేకుండా సేవలు అందుతున్నట్లు ఆర్ అండ్ ఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (విజయవాడ) కె.రామారావు శుక్రవారమిక్కడ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెండింగ్లో ఉన్న దస్తావేజుల నమోదును త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గత నాలుగు రోజులుగా పెండింగ్లో ఉన్న దస్తావేజుల నమోదును వేగవంతంగా పూర్తిచేసేందుకు శుక్రవారం రాత్రి 9 గంటల వరకు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను పొడిగించినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ సేవల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా, ప్రజాహిత దృక్పథంతో రిజిస్ట్రేషన్ సేవలు అందుతున్నాయన్నాయని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కె.రామారావు తెలిపారు.
Prajavartha Online Telugu News