న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య విద్యలో ప్రవేశాలకు అమలవుతున్న నీట్ విధానం గ్రామీణ ప్రాంతాలు, ప్రాంతీయ భాషల్లో చదివిన విద్యార్థులపై చూపుతున్న ప్రభావంపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్సభలో ప్రశ్నించారు. నీట్ కారణంగా వైద్య సీట్ల లభ్యతపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించిందా, రాష్ట్రాలకు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రవేశాల్లో మరింత వెసులుబాటు కల్పించాలని ఏవైనా విజ్ఞప్తులు వచ్చాయా, గత ఐదేళ్లలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయో, అలాగే దేశవ్యాప్తంగా న్యాయమైన, పారదర్శకమైన అడ్మిషన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటో తెలపాలని కోరారు.
ఈ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) చట్టం–2019 ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ (యూజీ)నే దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షగా కొనసాగుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో వైద్య విద్య అవకాశాలను విస్తరించేందుకు ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్లను గణనీయంగా పెంచినట్లు ఆయన తెలిపారు.
2022–23లో 99,463గా ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 2026–27 నాటికి 1,39,489కు పెరిగినట్లు పేర్కొంది. గత ఐదేళ్లలో మొత్తం 40,026 ఎంబీబీఎస్ సీట్లు పెరిగినట్లు సమాధానంలో పేర్కొన్నారు. అలాగే, ఎంసీసీ (మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ) ద్వారా అఖిల భారత కోటా, ఎయిమ్స్,జిప్మర్, కేంద్ర విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా, రాష్ట్ర కోటా సీట్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రాష్ట్రాలకు ప్రవేశాల్లో మరింత వెసులుబాటు కల్పించాలన్న అంశంపై ఎలాంటి నిర్ణయం లేదా మార్పును ప్రభుత్వం ప్రకటించలేదని తెలిపారు.
Prajavartha Online Telugu News