-రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్
రేపల్లె, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక అవసరాల పిల్లలకు నాణ్యమైన సేవలు అందించేందుకు స్వర్ణ భవిత వనరుల కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం రేపల్లె మండల కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రూ.29.30 లక్షలతో నూతనంగా నిర్మించిన స్వర్ణ భవిత ప్రత్యేక అవసరాల గల పిల్ల వనరుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి.,తో కలసి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేపల్లె మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రూ.29.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన స్వర్ణ భవిత ప్రత్యేక అవసరాల పిల్లల వనరుల కేంద్రాన్ని ప్రారంభించి వివిధ గదులు, సౌకర్యాలను పరిశీలించి అక్కడ విద్యనభ్యసిస్తున్న ప్రత్యేక అవసరాల పిల్లలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం పిల్లల తల్లిదండ్రులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందన్నారు. వారికి నాణ్యమైన విద్య, చికిత్స, థెరపీ, పునరావాస సేవలు ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో స్వర్ణ భవిత కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి ప్రతిభను వెలికితీసి వారి భవిష్యత్తును మరింత మెరుగుపరిచేలా అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాల పిల్లలకు అవసరమైన విద్యా, వైద్య, థెరపీ సేవలను సమగ్రంగా అందించేందుకు జిల్లాలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. స్వర్ణ భవిత కేంద్రం ద్వారా పిల్లలకు నిపుణుల సేవలు అందేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ.బి.శ్రీదేవి, డి ఐ ఓ.కోదండరామ్, డి ఈ ఓ.శ్రీనివాస్ సింగ్, ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News