-రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్
రేపల్లె, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.
శుక్రవారం రేపల్లె మండలం పేటేరు గ్రామంలోని ఆంజనేయస్వామి కాలనీలో డ్వాక్రా సంఘ సభ్యురాలు కొఠారి సావిత్రి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) పథకం ద్వారా రూ.10 లక్షల రుణం, అందులో రూ.3.50 లక్షల సబ్సిడీతో ఏర్పాటు చేసిన సాయి హర్ష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ యూనిట్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి కల్పన పథకాల ద్వారా రుణాలు పొందుతూ చిన్నతరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించి తమ కుటుంబాల ఆర్థికాభివృద్ధికితోడ్పడుతున్నారని తెలిపారు.ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) వంటి పథకాలను మహిళలుమరింతగావినియోగించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, సబ్సిడీలతో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకుని ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామిక వేత్త చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లాలో మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. మహిళలు చిన్న చిన్న వ్యాపార రంగంలో ముందుకు వచ్చి ప్రభుత్వ పథకాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బి.శ్రీదేవి, డిఆర్డీఏ పి డి.బి.సింగయ్య,ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News