విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భార్యాబిడ్డల ను కోల్పోయి అక్రమ కేసులలో నిందితుడిగా ఉన్నానని బాధితుడు చిన్నం నాగరాజు మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిన్నం నాగరాజు మాట్లాడుతూ తాను కడప జిల్లా మైలవరం మండలం వేపరాల గ్రామం అని తెలిపారు. తనకు 2017 సంవత్సరంలో భాగ్యలక్ష్మితో వివాహం అయినదని తనకు ఒక కుమారుడు కూడా ఉన్నాడని తెలిపారు. వృత్తిరీత్యా భార్యాబిడ్డలను వాళ్ళ పిన్ని వాళ్ళ వద్దకు వదిలి కేరళలో ఉద్యోగం చేసుకున్నట్లు వివరించారు. కోవిడ్ వచ్చిన నేపథ్యంలో తన స్వగ్రామానికి రాలేకపోయానని ఈ నేపథ్యంలో తన భార్య పిన్ని వాళ్ళు తన మీద అక్రమ సంబంధం అంటగట్టారని ఆరోపించారు. తన భార్య ఇవేమీ నమ్మలేదని, తనకు తరచూ ఫోన్ చేస్తూ ఉండేదని తన దగ్గర వాయిస్ రికార్డింగ్ లు, తాను పంపిన డబ్బులు రిసిప్ట్ లు ఉన్నాయని పేర్కొన్నారు. తన భార్యకు లేనిపోనివి చెప్పి ఆమెను మానసికంగా కృంగదీశారని గత సంవత్సరం సెప్టెంబర్ 17న తన భార్య బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి కన్నీరు మున్నయ్యారని విలపించారు. తన భార్య బిడ్డలు చనిపోవడానికి కారణం తననే అని తన మీద, తన తల్లిదండ్రుల మీద అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. తన భార్య బిడ్డలు మరణానికి కారణమైన చౌదం వెంకటరమణ అతని తమ్ముని భార్య చౌదం సుబ్బమ్మలను కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని మీడియాకు మొరపెట్టుకున్నాడు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి. రెడ్డి బాబు, బాధితుడు తల్లి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News