విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం పై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని నిర్థేశిత గడువులోగా నూరు శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఇవోలు, ఆర్వోలు, ఏఆర్వోలు ఈఆర్వోలతో సచివాలయం నుండి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం, ఎన్నికల జాబితాలో జనాభా సంబంధిత సారూప్య నమోదు, ( డిమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ ` డిఎస్వో ), అభ్యంతరాలు, ఫోటో సారూప్య నమోదు ( ఫోటో సిమిలర్ ఎంట్రీస్ ` పిఎస్ఇ) తదితర అంశాలపై గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానం పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 16 లక్షల 27 వేల 392 మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 12 లక్షల 28 వేల 006 మంది ఓటర్ డేటాకు ఆధార్ అనుసంధానించి 75.46 శాతంగా నమోదు చేశామన్నారు. ఇంకనూ ఆధార్ అనుసంధానం చేయాల్సిన సుమారు 4 లక్షల 423 ఓటర్ల డేటాకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయనున్నామన్నామన్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని విజయవాడ సెంట్రల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాలలో 64 శాతంగా ఉందని, ప్రక్రియ వేగవంతం చేసేలా నగరపాలక సంస్థ పరిధిలోని బూత్ లెవల్ అధికారులను ఆదేశించామన్నారు. ఓటర్ల జాబితాలో మొదటిసారి ఓటరుగా నమోదు, ఒక నియోజకవర్గంలో నుండి మరో నియోజకవర్గానికి బదిలీపై నమోదుకు సమర్పించే పారం 6, ఓటరు తొలగింపు కై ఫారం 7, మోడిఫికేషన్, క్లెయిమ్స్, అబ్జెక్షన్స్కు సమర్పించే ఫారం 8, తదితర దరఖాస్తులకు సంబంధించి పరిష్కరించే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాలో డెమోగ్రాఫీకల్లీ సిమిలర్ ఎంట్రీస్ (డిఎస్ఈ) ఫోటో సిమిలర్ ఎంట్రీస్ (పిఎస్ఇ) సంబంధించి పరిష్కరించే ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
వీడియోకాన్ఫరెన్స్లో నగరపాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, డిఆర్వో కె. మోహన్కుమార్, ఇఆర్వోలు, ఏఆర్వోలు ఉన్నారు.
Prajavartha Online Telugu News