విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక చేనేత వస్త్ర ప్రదర్శన Niche Handloom Marketing Expo-2024-25 ను వీవర్స్ సర్వీస్ సెంటర్ వారు, జౌళి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సహకారంతో విజయవాడ, మొగల్రాజపురం A ప్లస్ కన్వెన్షన్ సెంటర్ నందు ఏర్పాటు చేశారు.
ఈ ప్రదర్శనను చేనేత & జౌళి, BC & EWS సంక్షేమ శాఖ మంత్రి S. సవిత, 09.01.2025 న ఉదయం 10.00 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శన జనవరి 14 వ తేదీ వరకు కొనసాగానున్నది. ప్రదర్శనలో భాగంగా దేశం నలుమూలల నుండి వివిద రకాల చేనేత వస్త్ర సంస్కృతి గల నేత కార్మికులు, చేనేత సంస్థలు, మరియు చేనేత సంఘాలు తమ విభిన్న ఉత్పత్తులను విక్రయదారులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీని వలన చేనేత కార్మికులకు సహకారం అందించడమే కాకుండా పలు రకాల వస్త్ర సంప్రదాయాల గురించి ప్రజలలో అవగాహన ఏర్పడుతుందని ప్రదర్శన నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రస్తుత ప్రదర్శనలో ఆంధ్రపదేశ్ లో ప్రఖ్యాతి గాంచిన వేంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం, చీరాల కుప్పడం పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, దుప్పట్లు, పొందూరు షర్ట్లు మరియు ఇతర గృహాలంకరణ వస్తువులకు సంబందించి దాదాపు 25 స్టాల్స్ ను ఏర్పాటు చేసినట్లు, తెలంగాణా నుండి 4 స్టాల్స్, రాజస్తాన్ నుండి 2 స్టాల్స్ అందులో ఒకటి స్వయం సహయక సంఘం వారు ఏర్పాటు చేసినది, జార్ఖండ్ నుండి 2 స్టాల్స్, బీహార్ నుండి రెండు, మహారాష్ట్ర నుండు రెండు, వెస్ట్ బెంగాల్ నుండి రెండు, తమిళనాడు నుండి ఒకటి మరియు మధ్యప్రదేశ్ నుండి 2 స్టాల్స్ మొత్తంగా 10 రాష్ట్రాల నుండి దాదాపు 44 స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ చేనేత ప్రదర్శనకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, విజయవాడ రాజ్యసభ సభ్యులు కేశినేని శివనాథ్ మరియు ఇతర ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, వివిద శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఈ ప్రదర్శన లో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలియజేసారు.
Prajavartha Online Telugu News