– ప్రజల భూ హక్కుకు భరోసా కల్పించేలా సమస్యలకు శాశ్వత పరిష్కారం
– తక్షణమే పరిష్కారం కాని సమస్యలనూ ప్రత్యేక ప్రణాళికతో పరిష్కారానికి కృషి
– 33 రోజుల పాటు జరిగిన రెవెన్యూ సదస్సుల ద్వారా 4,813 పిటిషన్లు వచ్చాయి
– అర్జీల పరిష్కారంలో అప్రమత్తతతో ఉండాలని అధికారులకు ఆదేశాలు
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరిగాయని.. జిల్లాలో జరిగిన సదస్సుల్లో మొత్తం దాదాపు 4,813 పిటిషన్లు వచ్చాయని, ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టి ఇప్పటికే 1,819 అర్జీలను పరిష్కరించడం జరిగిందని.. గడువులోగా మిగిలిన వాటి పరిష్కారానికీ కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
బుధవారం ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద చివరి రోజు జరిగిన గూడూరుపాడు రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) స్టాల్ కార్యకలాపాలను పరిశీలించారు. అదేవిధంగా ప్రభుత్వ భూముల రిజిస్టర్, రెవెన్యూ సదస్సుల మినిట్స్ రిజిస్టర్, ఎండోమెంట్ భూములు, అసైన్మెంట్ భూములు తదితర వివరాలను పరిశీలించారు. గ్రామస్తులు అందించిన పిటిషన్ల ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. సదస్సుకు హాజరైన ప్రతిఒక్కరినీ పలకరించి సమస్యలు ఏవైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత డిసెంబర్ 6న రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయని.. బుధవారం వరకు షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తూ, సమాచారమిస్తూ సదస్సులు నిర్వహించినట్లు వివరించారు. వీటిలో ఎఫ్ లైన్ (బౌండరీ డీమార్కేషన్), ఇనామ్స్, అసైన్మెంట్ ల్యాండ్స్, భూ సేకరణ, రీసర్వే, ఆక్రమణలు, 22ఏ తదితరాలకు సంబంధించిన పిటిషన్లు వచ్చాయన్నారు. భూ హక్కుకు భరోసా కల్పిస్తూ భూ సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించడం జరుగుతోందన్నారు. భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు.. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సదస్సులను విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లి సమస్యలను తెలుసుకొని, పరిష్కరించే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎస్ఎల్ఏలోగా సమస్యలను పరిష్కరిస్తున్నామని, అదేవిధంగా కుటుంబ తగాదాలతో కొన్ని, మరికొన్ని కోర్టుల పరిధిలో ఉన్నాయని వివరించారు. కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కారం కాకపోయినా ప్రత్యేక ప్రణాళికతో వాటి పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి:
భూ వివాదాలు లేని గ్రామాలు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సదస్సులు నిర్వహించిందని.. వీఆర్వో, తహసీల్దార్, సర్వేయర్ తదితర క్షేత్రస్థాయి అధికారులు అర్జీల పరిష్కారంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు, రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. సదస్సులో భాగంగా గ్రామస్థులు కోరిన భూ రికార్డుల వివరాల పత్రాలను కలెక్టర్ లక్ష్మీశ అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, గుంటుపల్లి సర్పంచ్ బి.కవిత తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News