– ఈ నెలాఖరులోగా శతశాతం పరిష్కారానికి కృషిచేయాలి
– ఇప్పటికే పూర్తయిన 98.82 శాతం క్లెయిమ్ల సెటిల్మెంట్
– బాధితులకు చేయూతనివ్వడంలో బీమా సంస్థల కృషి భేష్
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంత ప్రజల వాహనాలు, వివిధ ఆస్తి నష్టాలకు సంబంధించి బీమా క్లెయిమ్ల పరిష్కారంలో బీమా సంస్థలు చూపిన చొరవ ప్రశంసనీయమని.. ఇప్పటికే 98.82 శాతం క్లెయిమ్ల పరిష్కారం పూర్తయిందని, మిగిలిన కొద్దిపాటి క్లెయిమ్లను కూడా ఈ నెలాఖరులోగా త్వరితగతిన పరిష్కరించాలని బీమా సంస్థలకు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ బీమా సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బీమా సంస్థల వారీగా నమోదైన క్లెయిమ్లు, పరిష్కరించిన క్లెయిమ్లు, ఇంకా మిగిలియున్న క్లెయిమ్లపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ 12,921 మోటారు వాహనాల క్లెయిమ్లు, 3,045 నాన్ మోటారు క్లెయిమ్లతో కలిపి మొత్తం 15,966 క్లెయిమ్లు రిజిస్టర్ కాగా.. మొత్తంమీద రూ. 148.58 కోట్ల చెల్లింపులతో 98.82 శాతం సెటిల్మెంట్ జరిగిందని.. మిగిలిన ఒకశాతం క్లెయిమ్ల పరిష్కారంలో ఉన్న అడ్డంకులను తొలగించి, త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇందుకు ప్రత్యేక బృందాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా బాధితులకు చేయూతనివ్వడంలో బీమా సంస్థలు తొలినుంచీ మంచి సేవలు అందిస్తున్నాయని.. చివరి అడుగు కూడా పూర్తిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, ఇన్ఛార్జ్ ఆర్టీవో ఆర్.ప్రవీణ్, వివిధ బీమా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News