– అత్యంత సరళీకృతంగా ధ్రువీకరణ పత్రాల జారీకి కృషిచేయాలి
– ధ్రువీకరణ పత్రాల కోసం ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు
– కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండకూడదు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 100 శాతం జనన, మరణాల నమోదుకు అధికారులు, సిబ్బంది కృషిచేయాలని, అత్యంత సరళీకృతంగా ధ్రువీకరణ పత్రాల జారీకి కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు.
జిల్లా విభజన అనంతరం మొదటిసారిగా జనన మరణ సంఘటనల రిజిష్ట్రీకరణపై అంతర శాఖల సమన్వయ సమావేశాన్ని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఏ ఒక్కరూ ఇబ్బందిపడకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి తల్లీబిడ్డ డిశ్చార్జ్ అయ్యే సమయంలో జనన ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్నారు. మరణం సంఘటనల విషయంలో మృతుని పార్థివ దేహాన్ని బంధువులకు అప్పగించే సమయంలో మరణ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలని ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన జనన/మరణ సంఘటన విషయంలో జననం/మరణం జరిగిన మూడు రోజుల్లో సంబంధిత ధ్రువీకరణపత్రం అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇళ్లలో జరిగిన జనన సంఘటనల విషయంలో ఆ ప్రాంత పంచాయితీ సెక్రటరీ సమగ్ర విచారణ జరిపి నమోదు చేయాలని, మరణ సంఘటనకు సంబంధించి కర్మకాండలు ముగిసేలోపు సంబంధీకులకు ధ్రువీకరణ పత్రం అందజేయాలన్నారు. ప్రసవాలకు ఆసుపత్రికి వెళ్లేటప్పుడు తీసుకెళ్లాల్సిన పత్రాలపై అవగాహన కల్పించాలని సూచించారు. జనన మరణ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండకూడదని స్పష్టం చేశారు.
సమావేశంలో డీపీవో పి.లావణ్య కుమారి, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి.జ్యోతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎం.సుహసిని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం గణాంక అధికారి లక్ష్మోజి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News