గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కోయంబత్తూరు మున్సిపల్ కార్పోరేషన్ లో అనుసరిస్తున్న త్రాగునీటి సరఫరా విధానం, అందుకు వినియోగిస్తున్నసాంకేతిక పద్దతుల ద్వారా ప్రజలకు మెరుగైన త్రాగునీటి సరఫరా జరుగుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. కోయంబత్తూర్ లో జరుగుతున్న రీజినల్ వర్క్ షాప్, క్షేత్ర స్థాయి పరిశీలనలో నగర కమిషనర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కోయంబత్తూర్ కార్పోరేషన్ లో శుక్రవారం జరిగిన వర్క్ షాప్ లో అమృత్ 2.0 డైరెక్టర్ ఇషా కాలియా ట్యాప్ నుండి త్రాగునీటిని తీసుకోవడంపై, అమృత్ అడిషనల్ సెక్రెటరి డి.తారా ప్రజలకు త్రాగునీటి సరఫరాపై అవగాహన కల్గించే విధానం గూర్చి వివరించారన్నారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిప్యూటీ అడ్వైజర్ డాక్టర్ రమాకాంత్ ట్యాప్ నుండి త్రాగునీటి సరఫరా అంశం గైడ్ లెన్స్ ని, కర్ణాటకలో 24/7 త్రాగునీటి సరఫరాపై డాక్టర్ కెపి జయరాం వివరించగా, కోయంబత్తూర్ లో దశలవారీగా త్రాగునీటి సరఫరాలో చేపట్టిన చర్యలను కమిషనర్ శివగురు ప్రభాకరన్ తెలిపారన్నారు. అనంతరం కోయంబత్తూరులోని ఏకెఎస్ నగర్ లో త్రాగునీటి పైప్ లైన్ పై లీకులను వినూత్నమైన విధానంలో వేగంగా గుర్తించడం, చరణ్ నగర్ లో ఆటోమేటిక్ గా త్రాగునీటి సరఫరా, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ సెల్ లను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Prajavartha Online Telugu News