మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) మందిరంలో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి జిల్లా విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లాలో పౌర హక్కుల రక్షణ, అట్రాసిటీ నివారణ చట్టం, మాన్యువల్ స్కావెంజింగ్ చట్టాల అమలు తీరును ఆయన కమిటీ సభ్యులతో చర్చించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల వివరాలు, బాధితులకు తక్షణ పరిహారం అందజేత, మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తున్న వారి సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఆయన జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి ఎన్ని చార్జిషీట్లు ఫైల్ చేశారు, కేసులను ఫైల్ చేయడంలో జాప్యానికి గల కారణాలు, ఇప్పటివరకు అట్రాసిటీ బాధితులకు నష్టపరిహారం ఎంత అందించారని ఆయన డివిజన్ వారీగా సమీక్షించారు.
కేసుల పరిష్కారం కోసం సబ్ డివిజన్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా సమీక్షించాలని ఆయన పోలీస్ అధికారులకు సూచించారు. అదేవిధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల పరిధిలో మాన్యువల్ స్కావెంజర్ల సంక్షేమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు తక్షణ న్యాయం చేసేలా పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన వారికి కుల దృవీకరణ పత్రాలు జారీ చేయడంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో డీఆర్వో కె చంద్రశేఖర రావు, మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం డీఎస్పీలు సిహెచ్ రాజా, విద్య శ్రీ, ధీరజ్ వినీల్, సిహెచ్ శ్రీనివాసరావు, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు కే స్వాతి, జి బాలసుబ్రమణ్యం, బిఎస్ హేలా షారోన్, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు షేక్ షాహిద్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News