-ఫిబ్రవరి 10న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని (NDD) విజయవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల ఫిబ్రవరి 10న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని (NDD) విజయవంతం చేయాలని, పిల్లలలో రక్తహీనత తగ్గించి, విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, వారి విద్యా పనితీరును మెరుగుపరచడం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ముఖ్య ఉద్దేశం అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాల్ నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది జాతీయ నులిపురుగుల దినోత్సవం (NDD) ఫిబ్రవరి 10, 2025న నిర్వహించనున్నారని, ఫిబ్రవరి 17న మాప్-అప్ డే నిర్వహణ ఉంటుందని, ఈ కార్యక్రమంలో 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అల్బెండజోల్ 400mg టాబ్లెట్ అందించనున్నామని తెలిపారు. నులిపురుగుల నివారణ ద్వారా రక్తహీనత తగ్గించి, విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, వారి విద్యా పనితీరును మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. స్కూల్స్, అంగన్వాడీలు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో 100% నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడానికి విద్య, ఐసిడిఎస్, మున్సిపల్, పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖల అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, ఆశా, అన్మలు, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు పూర్తిస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO) డా. బాలకృష్ణ నాయక్, DSO డా. హారిత, పీ ఓ – ఆర్బిఎస్కే డా. పద్మావతి, మెడికల్ ఆఫీసర్ డా. అభిజ్ఞ, డీఈఐసీ మేనేజర్ డా. గుణశేఖర్, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారి, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News