-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ వ్యాధుల ప్రభావిత 38 గ్రామాల ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన సురక్షిత కృష్ణా జలాలను అందించే తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఎ.కొండూరు, పరిసర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధులను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసిన రూ. 50 కోట్లతో చేపట్టిన పనుల ప్రగతిని పరిశీలించేందుకు సోమవారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశా అధికారులతో కలిసి ఎ.కొండూరులో పర్యటించారు. ఓవర్ హెడ్ రిజర్వాయర్ స్థితిగతులతో పాటు దాదాపు 200 కి.మీ. మీటర్ల మేర పైపులైన్ల పనుల ప్రగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎ.కొండూరు మండలంలోని 38 గ్రామాల్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులకు అదనంగా నిర్మిస్తున్న 14 ట్యాంకుల పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యంలోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ వెంట స్థానిక ఆర్డీవో కె.మాధురి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విద్యాసాగర్ తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News