– ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలి
– అధికారులు, సిబ్బందితో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
– క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రీసర్వేలో కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని.. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా రీసర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
సోమవారం మైలవరం మండలం, జంగాలపల్లి గ్రామంలో కలెక్టర్ లక్ష్మీశ పర్యటించి.. భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఫీల్డ్ గ్రౌండ్ ట్రూతింగ్ (భూమిపై కచ్ఛితత్వం) పనులు ఏ మేరకు జరుగుతున్నాయో తనిఖీ చేశారు. రైతులతో నేరుగా మాట్లాడి భూముల రీ సర్వే విషయమై వారికి గల అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కచ్చితమైన రికార్డులు అందించేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేయాలని ఆదేశించారు. గ్రామంలోని ప్రతి రైతుకు వారి పొలాల సర్వే నిర్వహణ విషయాన్ని నోటీసు ద్వారా తప్పనిసరిగా తెలియచేయాలన్నారు. అలాగే ఫీల్డ్లో రోవర్, ట్యాబ్ ఏవిధంగా పని చేస్తున్నాయో రైతులకు అవగాహన కల్పించారు. గ్రామంలోని రైతులు అందరితో ఒక వాట్సప్ గ్రూప్ ను క్రియేట్ చేయించి అందులో గ్రామంలో జరిగే రీ సర్వే వివరాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసి రైతులకు తెలియజేయాల్సిందిగా ఆదేశించారు. రీ సర్వే చేయడం ద్వారా రైతులకు ఏవిధమైన కచ్చితమైన కొలతలతో మున్ముందు రికార్డులు అందుబాటులోకి వస్తాయో కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. కార్యక్రమంలో జంగాలపల్లి గ్రామ రైతులు, అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే, ల్యాండ్ రికార్డ్స్) టి.త్రివిక్రమరావు, రెవెన్యూ, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News