– వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
– ఎక్కడా ఏ చిన్న పొరపాటుకూ తావులేకుండా చూడాలి
– డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను (ఐపీఈ-2025) విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయ శాఖల అధికారులు బృంద స్ఫూర్తితో వ్యవహరించి.. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) ఎం.లక్ష్మీ నరసింహం కోరారు.
సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో డీఆర్వో లక్ష్మీనరసింహం.. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి (డీఐఈవో) సీఎస్ఎస్ఎన్ రెడ్డితో కలిసి ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సమన్వయ శాఖల అధికారుల సమావేశం నిర్వహించారు. ఇంటర్మీడియెట్ విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీస్, ప్రజా రవాణా, వైద్య ఆరోగ్యం, విద్యుత్, పోస్టల్ తదితర శాఖల అధికారులు హాజరైన ఈ సమావేశంలో డీఆర్వో మాట్లాడుతూ ఇంటర్మీడియెట్ వొకేషనల్, జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 127 కేంద్రాల్లో జరుగుతాయని, అదేవిధంగా థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు 103 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. థియరీ పరీక్షలు ఉదయం 9 గం. నుంచి మధ్యాహ్నం 12 గం. వరకు జరగనున్నట్లు తెలిపారు. 41,295 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 39,564 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 80,859 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్ అధికారులను నియమించడం జరిగిందని.. 27 స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్ష పత్రాలను స్టోరేజ్ పాయింట్ల నుంచి పరీక్షా కేంద్రాలకు తరలింపు మొదలు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. బందోబస్తు ఏర్పాటు, భద్రతా చర్యలు, సీసీ కెమెరాల నిఘా విషయంలో పోలీసు శాఖతో సమన్వయం అవసరమన్నారు. 20 కేంద్రాలకు ఒకటి చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్ల ఏర్పాటుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని సిద్ధం చేయాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రాథమిక చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలని డీఆర్వో లక్ష్మీ నరసింహం సూచించారు.
సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ ఎస్.సరళకుమారి, డీఈసీ సభ్యులు జి.ఝాన్సీ, డీఈవో యూవీ సుబ్బారావు, ఏపీఎస్ఆర్టీసీ అధికారి కె.సురేష్ కుమార్, పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ ఎం.నరసింహస్వామి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ షేక్ అమ్మద్ అలీ, విద్యుత్ శాఖ ఈఈ ఎ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News