-మంత్రి సవితతో చికాగో ప్రతినిధులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవితను అమెరికాలోని చికాగో రాష్ట్ర ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్ లో చికాగో లో పురుడ్యూ యూనివర్శిటీ, జీఎస్ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోయే జీఎస్ఏ గ్లోబల్ మిల్లిట్స్ ఎక్స్ పో లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి సవితకు చికాగో ప్రభుత్వ ప్రతినిధి లా షాన్ కె.ఫోర్డ్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవితతో చికాగో రాష్ట్ర ప్రతినిధులు చర్చించారు. అమెరికాలో చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంపై తమవంతు సాయమందిస్తామన్నారు. ఇందుకోసం పలు రాష్ట్రాల్లో చేనేత ఎక్స్ పో లు నిర్వహిస్తామన్నారు. పురుడ్యూ యూనివర్శిటీ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాల డిజైన్ల తయారీపై ఆంధ్రప్రదేశ్ చేనేతలకు శిక్షణ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత స్పందిస్తూ, అమెరికాలో చేనేత ఎక్స్ పోల నిర్వహణపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళతామన్నారు. నేతన్నలకు నూతన డిజైనింగ్ శిక్షణివ్వడానికి ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ ప్రభాకర్, డాకర్టర్ రాజీవ్, డాక్టర్ మహ్మద్ తాజ్ ముల్ హుస్సేన్, విశ్వభారతి, కె.కృష్ణమూర్తి, తిరునగరి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News