మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్తలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కలిగి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్వచ్ఛ్ ఆంధ్ర- స్వచ్ఛతహే సేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం మచిలీపట్నం రూరల్ ఎస్ఎన్ గొల్లపాలెం, అరిశేపల్లి గ్రామాలలో విస్తృతంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రజలకు ఎటువంటి వ్యాధులు సంక్రమించవన్నారు. పొడి తడి చెత్త వేరు చేసే విధానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
వేర్వేరు డస్ట్ బిన్ లో వేయడం వల్ల వాటిని గార్బేజిలో సులువుగా వేరు చేయవచ్చునన్నారు. సేకరించిన చెత్తను సమీపంలోని చెత్త నుండి సంపద తయారీ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) కేంద్రాలకు తరలించి అక్కడ కంపోస్ట్ ఎరువు తయారీతో అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునన్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్తను వేయకుండా నిర్దేశించిన ప్రాంతాల్లోనే వేసి నగరపాలక సిబ్బందికి సహకరించాలని అన్నారు.రహదారులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ దోమలు ప్రబలకుండా బ్లీచింగ్ వెదజల్లాలన్నారు. శారీరక శుభ్రత లాగే పరిసరాల పరిశుభ్రతను కూడా పాటిస్తూ ఆహ్లాదకర జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
Prajavartha Online Telugu News