-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అదానీ అవినీతిపర్వంపై ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. అమెరికా అధ్యక్షునిగా మరలా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మన దేశంలో అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన అదానీకి సహాయం చేసే విధంగా ఫారన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్`1977 అమలును 6 మాసాలపాటు నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాం.
మన దేశంలో అదానీకి వత్తాసుగా ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే అన్ని రకాలుగా సహాయం చేస్తున్నారు. గతంలో హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన సమయంలో కనీసం పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు దానిపై చర్చను లేవనెత్తే పరిస్థితి లేకుండా చేశారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా అదానీకి అనుకూలంగా ఈ చర్యలు చేపట్టడంతో ఇటు మోడీ, అటు ట్రంప్ కార్పొరేట్ అనుకూల విధానాలు తేటతెల్లమవుతున్నాయి. అదానీకి భారత్లో మోడీ, అమెరికాలో ట్రంప్ సపోర్టు చేయడాన్నిబట్టి కార్పొరేట్లతో కుమ్మక్కవ్వడానికి ఉవ్విళ్లూరుతున్నట్లున్నది. అదానీ అవినీతి కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్నట్లున్నది. భారతదేశంలోని 4 రాష్ట్రాల్లో దాదాపు రూ.2100 కోట్లు లంచాలుగా ముట్టజెప్పి, ఒప్పందాలు చేసుకున్నారంటూ న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ కోర్టులో అదానీపై కేసు నమోదయినప్పటికీ రెండు ప్రభుత్వాలు అదానీకి ఊడిగం చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గమైన, నీచమైన అంశం మరొకటి ఉండదు. దీనిని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోంది. ఇప్పటికైనా ప్రధాని నరేంద్రమోడీ అదానీ అవినీతి కార్యకలాపాలపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News