గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే పనులను ప్రాధాన్యత క్రమంలో నిర్దేశిత గడువు మేరకు పూర్తి చేసేలా ఏఈలు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమీషనర్ తమ రోజు వారీ పర్యటనలో భాగంగా సంగడిగుంట, ఎల్ఎల్ఆర్, పాత గుంటూరు, గణేష్ నగర్ ప్రాంతాలలో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులైన రోడ్లు, డ్రైన్లు నిర్మాణ సమయాల్లోనే స్థానిక వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులు తప్పనిసరిగా అందుబాటులో ఉండి పనులను పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపాలను గుర్తిస్తే సంబందిత కార్యదర్శులు, ఏఈలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎల్ఎల్ఆర్ ని పరిశీలించి, త్రాగునీటి సరఫరా వ్యవస్థ అత్యంత కీలకమని, రిజర్వాయర్లలో త్రాగునీటి సరఫరా చేయు సమయంలో క్లోరిన్ తనిఖీలు చేయాలన్నారు. త్రాగు నీరు సరఫరా సమయంలో వార్డుల్లో పర్యటిస్తూ నీటి నాణ్యతను పరిశీలించాలని, ఎక్కడైనా పైపు లైన్లు లీకులు గమనిస్తే వెంటనే ఉన్నతాధికారులకు తెలియచేసి లీకులకు వెంటనే మరమ్మతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పలు ప్రాంతాల్లో పారిశుద్యం, ఖాళీ స్తలాల సమస్యలపై ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు ప్రజారోగ్య అధికారులతో మాట్లాడుతూ ఖాళీ స్థల యజమానులకు నోటీసులు ఇవ్వాలని, ప్రతి వార్డ్ సచివాలయం పరిధిలో నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం చేయాలని స్పష్టం చేశారు.
పర్యటనలో ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News