– జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్న ఎంఎస్ఎంఈల పరిశీలన
– నిస్సంకోచంగా యూనిట్ల యజమానులు సమాచారమివ్వొచ్చు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక యూనిట్ల (ఎంఎస్ఎంఈ) ప్రస్తుత స్థితిగతులను తెలుసుకొని.. సమాచారాన్ని విశ్లేషించి, అవసరమైన చేయూతనందించేందుకు సర్వే చేయడం జరుగుతోందని, యూనిట్ల యజమానులు ప్రభుత్వ సిబ్బందికి నిస్సంకోచంగా సమాచారం ఇవ్వొచ్చని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ గురువారం నందిగామలో ఎంఎస్ఎంఈ సర్వే పరిశీలన కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.
ఎంఎస్ఎంఈ (ఉద్యమ్) సర్వే యాప్లో సమాచారాన్ని పొందుపరిచే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఎంఎస్ఎంఈ సర్వేను విస్తృత స్థాయిలో చేపట్టడం జరుగుతోందని, ఆరోగ్యకర పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో ఈ సర్వేను చేపట్టడం జరిగిందన్నారు. పారిశ్రామిక యూనిట్కు ఏదైనా రుణ సహాయం అవసరమా? నైపుణ్యాభివృద్ధితో పాటు మార్కెటింగ్ అవసరాలు ఏమైనా ఉన్నాయా? ఇలా ఆయా యూనిట్లకు అవసరమైన చేయూతనందించేందుకు సర్వేను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్లలో సాంకేతిక వినియోగం, నిర్వహణ నైపుణ్యాల్లో లోపాలను గుర్తించి, సరిదిద్దేందుకు కూడా సర్వే ఫలితాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఎవరికైనా ఏవైనా సందేహాలుంటే తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాన్ని సంప్రదించి, నివృత్తి చేసుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఎంఎస్ఎంఈ యూనిట్ల 100 శాతం వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తికి క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది కృషిచేస్తున్నారని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News