– ఫిర్యాదులు రుజువైతే ఏజెన్సీ లైసెన్సుల రద్దుకూ వెనుకాడం
– దీపం-2 అమలు ప్రగతికి లబ్ధిదారుల సంతృప్తే గీటురాయి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దీపం-2 పథకం ద్వారా అందించే ఉచిత గ్యాస్ సిలిండర్లకు లబ్ధిదారుల నుంచి అదనంగా ఒక్క రూపాయి వసూలు చేసినా సహించేది లేదని, ఫిర్యాదులు రుజువైతే సంబంధిత గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దుచేస్తామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరించారు.
జిల్లాలో దీపం-2 పథకం అమలు, ఐవీఆర్ఎస్ సర్వే నివేదికలు, ఫిర్యాదులపై చర్యలు తదితరాలపై చర్చించేందుకు కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో సమావేశం జరిగింది. పౌర సరఫరాలు, లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులతో పాటు వివిధ ఎల్పీజీ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీపం-2 పథకాన్ని అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో అమలుచేసే విషయంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించిందని, పథకం అమలు ప్రగతికి లబ్ధిదారుల సంతృప్తే గీటురాయని, దీపం పథకం కింద ఉచితంగా పొందుతున్న సిలిండర్లకు లబ్ధిదారులు తాము చెల్లించిన నగదు 48 గంటల్లో తమ ఖాతాల్లో జమవుతోందన్నారు. ఇప్పటివరకు పథకం ద్వారా 4,05,611 మంది ఖాతాల్లో దాదాపు రూ. 32.19 కోట్లు జమయిందన్నారు. అయితే ఉచిత గ్యాస్ పథకం కింద ముందు చెల్లించే అసలు బిల్లుకు అదనంగా డెలివరీ బాయ్స్ కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని.. ఇలాంటి ఫిర్యాదులకు సంబంధిత గ్యాస్ ఏజెన్సీ డీలర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఐవీఆర్ఎస్ సర్వే ఆధారంగా మొదటి విడతలో తొమ్మిది మంది ఎల్పీజీ డీలర్లకు, రెండోవిడతలో అయిదు మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న 52 ఏజెన్సీలు నిబద్ధతతో సేవలందించాలని, ఏవైనా అవకతవకలకు పాల్పడితే ఏపీ పెట్రోలియం ప్రొడక్ట్స్ యాక్ట్, ఎంఆర్పీ యాక్ట్ తదితరాల ద్వారా చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ వినియోగదారులు.. రశీదులో ముద్రించియున్న ధరకంటే అదనంగా ఒక్క రూపాయికూడా చెల్లించనవసరం లేదని, అదేవిధంగా వినియోగదారుడు గ్యాస్ సిలిండర్ తీసుకునే సమయంలో తూకంలో తేడా ఉన్నట్లు అనుమానం ఉంటే సదరు డెలివరీ బాయ్స్ ద్వారా తూకాన్ని సరిచూసుకోవచ్చన్నారు. పౌర సరఫరాలు, తూనికలు-కొలతల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలను ముమ్మరం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
సమావేశంలో డీఎస్వో ఎ.పాపారావు, జిల్లా లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ కృష్ణచైతన్యతో పాటు ఎల్పీజీ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News