Breaking News

పేదలందరికీ ఇళ్ల పట్టాలు

-ఇప్పటికి 70 వేల దరఖాస్తులు
-జగనన్న ఇళ్ల పథకంలో అవకతవకలను నిగ్గు తేలుస్తాం
-శాసనమండలిలో రాష్ర్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ర్టంలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ర్ట రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి పేద వాడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇళ్లు ఉండాలనేది టీడీపీ విధానమని, అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం పేదలకు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత నెలలో ఇందుకు సంబంధించి జీవో ఇవ్వగా ఇప్పటి వరకు 70,238 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తుదారులెందరో లెక్క తేలిన తర్వాత ప్రభుత్వ భూములు ఉన్న చోట కేటాయింపులు చేస్తామని, ప్రభుత్వ భూములు లేకుంటే ప్రయివేట్ భూములనయినా సేకరించి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. సోమవారం రాష్ట్ర శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, హనుమంతురావు తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం 30 లక్షల పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చిందని చెప్పగా దాన్ని మంత్రి అనగాని ఖండించారు. 22 లక్షల పట్టాలు మాత్రమే ఇవ్వగా అందులో ఏడు లక్షల మంది ఆ పట్టాలను రిజిస్ర్టేషన్ చేయించుకోవడానికి ముందుకు రాలేదని, వీరంతా ఎవరని ప్రశ్నించారు. వీరు నిజంగా అర్హులైతే రిజిస్ర్టేషన్ చేయించుకోవడానికి ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సెంటు స్థలం మాత్రమే ఇవ్వగా మా ప్రభుత్వం రెండు, మూడు సెంట్ల స్థలం ఇస్తోందన్నారు. అంతేకాక ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందిస్తోందని, గత ప్రభుత్వం కేవలం రెండున్నర లక్షల రూపాయలను మాత్రమే, అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులనే ఇచ్చారని చెప్పారు. జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణంలా మారిందన్నారు. లబ్దిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారన్నారు. ధనవంతులు, ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు, అనుయాయులకు ఇళ్ల పట్టాలు పంచి పెట్టారన్నారు. ఇళ్ల పట్టాల కోసం భూముల కోనుగోలు లోనూ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారన్నారు. నివాసయోగ్యం కాని భూములను, శశ్మానాలు, డంపింగ్ యార్డులు పక్కనున్న భూములను, వర్షం వస్తే మునిగిపోయే భూములను రెండింతలు, మూడింతలు అధిక ధరలకు ప్రభుత్వంతో కొనిపించారన్నారు. మొత్తం 10,500 కోట్ల రూపాయలతో 26 వేల ఎకరాల ప్రయివేట్ భూములను కొనుగోలు చేశారన్నారు. ఇందులో నుండి వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతలు, కార్యకర్తల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. అయితే జగనన్న ఇళ్ల పథకంలో జరిగిన అవకతవకలన్నింటీని నిగ్గు తేలుస్తామని అన్నారు. కానీ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం పేదలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే అందరికీ ఇళ్ల పథకాన్ని చేపట్టిందని తెలిపారు. అర్హులైన ప్రతి పేద వాడికి ఇంటి పట్టా ఇచ్చి ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *