విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ తీర్మానం చేయడం వలన తెలుగుదేశం పార్టీకే నష్టం కలుగుతోందని పార్లమెంటు మాజీ సభ్యులు చింతా మోహన్ అన్నారు. మంగళవారం విజయవాడ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ… కర్నాటకలో మాదిరిగా ఏపీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు 24 శాతం, ఓబీసీలకు 15 శాతం ఇవ్వాలని, పేదలు, అంటరాని వారి అమాయకత్వాన్ని అండగా చేసుకుని, బలహీన వర్గాలపై బలమైన వర్గాలు దాడిగా ఆయన అభివర్ణించారు. దక్షిణ భారతదేశంలో దళితుల్లో వందలో 90 మంది మాలలు ఉండగా, ఉత్తర భారతదేశంలో దళితుల్లో 90 శాతం మాదిగలు ఉన్నారని తెలిపారు. ఎస్సీలను వర్గీకరణ చేయడం దేశానికి మంచిది కాదని, దేశ సమైక్యతకు చాలా నష్టమని అన్నారు. రాబోయే రోజుల్లో దీని ప్రభావం తెలుస్తుందన్నారు. గత 10 సంవత్సరాల్లో మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ హిందీపై మాట్లాడటం, డీలిమిటేషన్ పేరుతో ఉత్తర, దక్షిణ భారతదేశం చిచ్చు పెడుతున్నారని అన్నారు. ముస్లిం వక్స్ బోర్డు ఆస్తులపై ఇప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టడం, అలాగే టీటీడీ బోర్డులో అన్య మతాల అంశం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. 2024లో కూటమి పార్టీల గెలుపునకు జగన్ కారణమని, భూములపై తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు భయపడి, కూటమికి ఓట్లు వేశారే తప్ప ఇది 100 శాతం స్ట్రైక్ రేట్ కానేకాదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్కు సనాతన ధర్మం అంటే ఏమిటో పూర్తిగా తెలియదన్నారు. అంటరానితనం నిర్మూలన, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం, నిరుపేద రోగి కన్నీళ్లు తుడవడమే సనాతన ధర్మమన్నారు. వేదాల సారాంశం చెబుతున్నది ఇదేనని చింతా మోహన్ తెలిపారు. నాడు తాను ఎంతో కష్టపడి తిరుపతికి అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకువస్తే, దానిని ప్రైవేటీకరణ చేసి పుణ్యక్షేత్రంలో రెండు వేల ఎకరాలు భూములపై బీజేపీ కన్ను వేసిందని, అటువంటి అలోచనలు ఉంటే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగాల వలనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందని, దానిని నిర్వీర్యం చేసి, ఎంతో విలువైన 25 వేల ఎకరాల భూములపై అదానీ కన్ను పడిరదన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, అదానీ ఫ్యాక్టరీగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రూ.11 వేల కోట్ల కాదు విశాఖ ఉక్కు పరిశ్రమకు, శాశ్వత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News