– పర్యాటకులకు మధురానుభూతిని మిగిల్చేలా ప్రత్యేక ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హస్త కళాకారుల చేతుల నుంచి జీవం పోసుకొంటూ దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొండపల్లి బొమ్మ ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటిచెప్పేలా.. వన్నె తగ్గని సృజనాత్మక సంపదను భావితరాలకు అందించేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ను అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం కలెక్టర్ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లిలో పర్యటించారు. హస్తకళాకారుల సొసైటీ భవనాన్ని పరిశీలించి, చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందేందుకు అపార అవకాశాలున్నాయని.. భౌగోళిక, ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యమున్న జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీలకు కూడా రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా శతాబ్దాల చారిత్రక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా ఉన్న కొండపల్లి బొమ్మ విశిష్టతను పర్యాటకులకు చాటిచెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. భవనంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసి, సుందరీకరణ పనులు చేపట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. బొమ్మ చారిత్రక వైభవం, బొమ్మల తయారీకి ఉపయోగించే తెల్ల పొణికి చెక్క, అత్యంత ప్రాచుర్యం పొందిన బొమ్మలు తదితర విశేషాలను కళాకారులు కళ్లకు కట్టినట్లుగా ప్రత్యక్ష అనుభూతి పొందేలా పర్యాటకులకు వివరించేందుకు ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉపయోగపడుతుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. కొండపల్లిలో పర్యటించే పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, జిల్లా పర్యాటక అధికారి శిల్ప, కొండపల్లి మునిసిపల్ కమిషనర్ రమ్య కీర్తన తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News