Breaking News

ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు ఉత్పత్తి మొదలుపెడితేనే లక్ష్యాన్ని చేరుకున్నట్లు

-పెట్టుబడుల సాధన ఫలితాలు క్షేత్ర స్ధాయిలో కనిపించాలి
-ఉద్యోగాలు పొందిన వారి వివరాలతో త్వరలో పోర్టల్
-5వ SIPB సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
-ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూకేటాయింపులు…మంత్రి లోకేష్ ప్రతిపాదనకు సీఎం అంగీకారం
-కొత్తగా రూ.30,667 కోట్లు పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు
-గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో 5 SIPB సమావేశాలు
-కూటమి ప్రభుత్వంలో 11 నెలల్లోనే 5 SIPB సమావేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఎంతముఖ్యమో… ఆ పెట్టుబడులు క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చడం కూడా అంతే ముఖ్యం అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అనుకున్న సమయానికి ఆయా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించడం అవసరమని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఏదైనా ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినప్పుడే…ఆ సంస్థ ఎప్పుడు ఉత్పత్తి ప్రారంభిస్తుందనే తేదీపై స్పష్టత తీసుకోవాలని చెప్పారు. ఆ తేదీకి అనుగుణంగా దశల వారీగా ప్రాజెక్టు పురోగతిని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 5వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 16 సంస్థల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఐ అండ్ సీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఎనర్జీ తదితర రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. తాజా ప్రతిపాదనలతో రూ.30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇప్పటివరకు ఎన్ని సంస్థలు ఉత్పత్తి ప్రారంభించాయి… ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయనేది వివరణాత్మకంగా తదుపరి ఎస్ఐపిబి సమావేశంలో రిపోర్ట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఏ సంస్థ ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చిందనే వివరాలతో పోర్టల్ కూడా రూపొందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న ఐటీ అండ్ హెఆర్డీ మినిస్టర్ లోకేష్… ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూమి కేటాయింపులు జరిపేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు. భూములు తక్కువ ధరకు ఇవ్వడం ద్వారా మరిన్ని ఐటీ కంపెనీలను ఆకట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అందుకుతగ్గట్టు ఐటీ పాలసీని సవరించి తీసుకురావాల్సిందిగా సూచించారు.

ఇప్పటివరకు రూ.4,70,879 కోట్ల పెట్టుబడులు :
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన 5 ఎస్ఐపీబీ సమావేశాల్లో 57 సంస్థలకు సంబంధించి రూ.4,70,879 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపగా, మొత్తం 4,16,688 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో 5 ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించగా, కూటమి ప్రభుత్వం వచ్చాక 5 ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించడం విశేషం.

5వ ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిన పెట్టుబడుల వివరాలు :
1) మా మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్ : విజయనగరం జిల్లా – రూ.2,063 కోట్ల పెట్టుబడులు, 1,000 ఉద్యోగాలు
2) ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ : ఎంపీ సెజ్, నాయుడుపేట – రూ.4,200 కోట్ల పెట్టుబడులు, 1,500 ఉద్యోగాలు
3) ఎల్జీ వెండర్స్ : శ్రీసిటీ, తిరుపతి జిల్లా – రూ. 839 కోట్ల పెట్టుబడులు, 692 మందికి ఉద్యోగాలు.
4) ప్రొటీరియల్ లిమిటెడ్ : శ్రీసిటీ, తిరుపతి జిల్లా – రూ. 1,055 కోట్ల పెట్టుబడులు, 515 ఉద్యోగాలు
5) స్నేహ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ : రూ.459 కోట్ల పెట్టుబడులు, 559 ఉద్యోగాలు
6) పెట్రా సిలికాన్ ప్రైవేట్ లిమిటెడ్ : శ్రీ సత్యసాయి జిల్లా – రూ.585 కోట్ల పెట్టుబడులు, 477 ఉద్యోగాలు
7) డిక్సాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ : తిరుపతి జిల్లా, కడప జిల్లాలు
8) రామ్కో సిమెంట్స్ : నంద్యాల జిల్లా – రూ.478 కోట్ల పెట్టుబడులు, 550 ఉద్యోగాలు
9) హెచ్ఎఫ్‌సీఎల్ & ఎంఎండబ్ల్యుఎల్ : శ్రీ సత్యసాయి జిల్లా – రూ.1,198 కోట్లు, 870 ఉద్యోగాలు
10) టాప్‌స్టోన్ మెటల్స్, అలాయ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ : శ్రీకాకుళం జిల్లా – రూ. 32 కోట్లు, 200 మందికి ఉద్యోగాలు
11) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ : విశాఖపట్నం – రూ.1,370 కోట్ల పెట్టుబడులు, 12,000 ఉద్యోగాలు
12) ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ : విశాఖపట్నం – రూ.5,278 కోట్ల పెట్టుబడులు, 2,500 ఉద్యోగాలు
13) జేఎస్‌డబ్ల్యు నియో ఎనర్జీ లిమిటెడ్ : కర్నూలు జిల్లా, 88 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్, రూ. 660 కోట్ల పెట్టుబడులు, 110 మందికి ఉద్యోగాలు
14) రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ : అనంతపురం జిల్లా, 540 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్, రూ.3,000 కోట్ల పెట్టుబడులు, 1,860 ఉద్యోగాలు
15) చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ : తిరుపతి జిల్లా, 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, రూ.2,450 కోట్ల పెట్టుబడులు, 2,400 ఉద్యోగాలు
16) చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ : శ్రీ సత్యసాయి జిల్లా, 2,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, రూ.7,000 కోట్ల పెట్టుబడులు, 6,900 ఉద్యోగాలు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *