-జూలై 30 జేఏసి రాష్ట్రకార్యవర్గంలో చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం
-జేఏసి కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టిదామోదరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపిపిటిడి (ఆర్టీసి) ఉద్యోగసంఘాల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని. జిల్లాలలో ఈనెల 27వ తేదీన వేలాది మంది ఆర్టీసి ఉద్యోగులు చేసిన సంతకాలతో కూడిన వినతిపత్రాలను జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కి సమర్పించనున్నామని ఏపిపిటిడి(ఆర్టీసి)ఉద్యోగసంఘాల కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు ఆదివారం ఒక ప్రకటనద్వారా తెలియజేసారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నడపాలనే విధానాన్ని పూర్తిగా విరమించుకొని, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసి ద్వారానే విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసి ఉద్యోగులతోనే నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని జేఏసీ ఈ సందర్భంగా బలంగా కోరుతోంది.
ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలంటే ఆర్టీసిని బలహీనపరిచే నిర్ణయాలు కాకుండా, కొత్త బస్సులు కొనుగోలు చేయడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆస్తి అయిన ఆర్టీసిని ప్రైవేటీకరణ దిశగా నెట్టే ఏ ప్రయత్నాన్నైనా ఉద్యోగులు జేఏసి గా తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. జూలై 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఉద్యోగుల సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని కేటగిరీల ఉద్యోగులు విశేష స్పందన తెలియజేయడం ఆర్టీసి పరిరక్షణపై ఉద్యోగుల్లో ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని తెలిపారు.
ఈనెల 30వ తేదీన విజయవాడలో జరిగే ఏపిపిటిడి (ఆర్టీసి) ఉద్యోగసంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రభుత్వ స్పందనను సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకుంటామని జెఏసి కో-కన్వినర్లు పి.వి.రమణారెడ్డి, జి.వి.నరసయ్య, సి.హెచ్.సుందరయ్య, కట్టాసుభ్రమణ్యం, యస్.వి.శేషగిరిరావు, వై.శ్రీనివాసరావు, కె.సూర్యప్రకాశరావు, డి.మాల్యాధ్రి తెలిపారు.
Prajavartha Online Telugu News