విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన ప్రతి వినతిని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు ఆదేశించారు. సోమవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి మూలకారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ఫిర్యాదు పరిష్కార ప్రక్రియపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించడంతో పాటు తీసుకున్న చర్యలను పారదర్శకంగా వివరించాలని అన్నారు. సమస్యలు మళ్లీ తలెత్తకుండా శాఖల మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ వారపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 17 వినతులు అందాయి. వాటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై 10 ఫిర్యాదులు, ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన 4, రెవెన్యూ శాఖకు సంబంధించిన 1, యూసీడీ కు సంబంధించిన 2 ఫిర్యాదులు నమోదు కాగా, సంబంధిత శాఖల అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె. శకుంతల, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ (ఇన్చార్జి) డాక్టర్ గోపాల్ కృష్ణ నాయక్, చీఫ్ ఇంజనీర్ సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, పర్యవేక్షణ ఇంజనీర్లు చంద్రశేఖర్, కె. దుష్యంత్, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్రశేఖర్, జె.డి. అమృత్, బి. చిన్నపరెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News