అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ శాఖ ఉన్నతాధికారుల బృందం మంగళవారం సందర్శించింది. రాజస్థాన్ ప్రభుత్వరంగ సంస్థ రాజ్కాంప్ ఇన్ఫో సర్వీసెస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ లక్ష్మీకాంత్ కటార, రాజస్థాన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్టుమెంట్కు చెందిన బ్రహ్మగుప్త సెంటర్ ఆఫ్ ఫ్రంటీయర్ టెక్నాలజీస్ సంస్థ నోడల్ ఆఫీసర్ రమేష్ దవాండ, డిప్యూటీ డైరెక్టర్ నితీష్ కుమార్ జంగడిల నేతృత్వంలో అధికారులతో కూడిన ప్రతినిధుల బృందం ఆర్టీజీఎస్ పనితీరును గురించి తెలుసుకోవడానికి వచ్చారు. ఈ బృందానికి ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ స్వాగతం పలికి ఆర్టీజీఎస్ పనితీరు గురించి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఆర్టీజీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డేటా డ్రివన్ గవర్నెన్స్ ఆశయాల గురించి, డేటాలేక్, దానిద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాల గురించి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వంలోని 40 శాఖాల్లోని ఒకచోటకు తీసుకొచ్చి అతిపెద్ద డేటాలేక్ ను రూపొందించామన్నారు. కృత్రిమ మేథ ద్వారా ఈ డేటా ఆధారంగా పాలన మరింత సరళతరం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా పలు రకాల యూస్ కేసెస్ రూపొందించామని తెలిపారు. ఆర్టీజీెస్ సీసీటీవీ360 ద్వారా శాంతిభద్రతలను పర్యవేక్షణలో పోలీసులకు ఆర్టీజీెెఎస్ సాంకేతిక సహకారాన్ని అందిస్తోందన్నారు. అవేర్ విభాగం ద్వారా వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి ప్రాణ నష్టం, ఆస్తినష్టం వాటిల్లకుండా ముందస్తుగానే ఆయా ప్రాంతంలోని ప్రభుత్వ యంత్రాంగాన్ని, పౌరులను ముందస్తుగానే అప్రమత్తం చేసేలా ఈ వ్యవస్థ పనిచేస్తోందన్నారు. కేవలం వాతావరణం గురించి మాత్రమే కాకుండా, ఇప్పుడు ఈ విభాగం ద్వారా రైతులకు ఆగ్రో అడ్వైజరీ కూడా ఇస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో నీటి నిల్వ పరిస్థితులను, ఆయా ప్రాంతాల్లో కురిసే వర్షాలు, నీటి లభ్యతలను రియల్ టైమ్ లో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఆర్టీజీఎస్ పనితీరు అద్భుతంగా ఉందని, ఇతర రాష్ట్రాలకు ఈ వ్యవస్థ ఆదర్శప్రాయంగా ఉందని రాజస్థాన్ ప్రభుత్వ అధికారులు కొనియాడారు. ఈ సమావేశంలో ఆర్టీజీఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి. శ్రీఖర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News