-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి, క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆయన ప్రజల వినతులను స్వీకరించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కమిషనర్, గతంలో అందిన ఫిర్యాదుల పరిష్కార పురోగతిని శాఖాధిపతులతో సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను పెండింగ్లో ఉంచకుండా, నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా, నగర పరిధిలోని ప్రతి సచివాలయంలో ప్రతి సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక తప్పనిసరిగా ప్రారంభం కావాలని, అక్కడికి వచ్చే ప్రజల వినతులను సకాలంలో స్వీకరించి సంబంధిత శాఖలకు పంపిస్తూ త్వరితగతిన పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు.
మున్సిపల్ సేవల కోసం అందుబాటులో ఉన్న “పురమిత్ర” యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యలను ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేస్తూ కాలయాపన చేయకుండా, సంబంధిత శాఖాధిపతులు స్వయంగా స్పందించి సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించగలమని పేర్కొన్నారు.
ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 24 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వాటిలో పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు, రోడ్ల ఆక్రమణలపై 5 ఫిర్యాదులు, ఇంజనీరింగ్ శాఖకు 6, ఎస్టేట్ శాఖకు 5, పబ్లిక్ హెల్త్కు 2, రెవెన్యూ శాఖకు 2, స్పెషల్ సెల్కు 2, పీఓ-యూసీడీకి 1, హౌసింగ్కు 1 ఫిర్యాదు అందినట్లు కమిషనర్కు వివరించారు.
ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు స్వయంగా పరిశీలించి, సమస్య మూల కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా, జవాబుదారీతనంతో, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఏ. రవీంద్రరావు, డాక్టర్ డి. చంద్రశేఖర్, కె. శకుంతల, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ (ఇన్చార్జి) డాక్టర్ గోపాల్ కృష్ణ నాయక్, చీఫ్ ఇంజనీర్ సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) సృజన, పర్యవేక్షణ ఇంజనీర్లు చంద్రశేఖర్, కె. దుష్యంత్, అకౌంట్స్ ఆఫీసర్ బి. సత్యనారాయణమూర్తి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి. హరీష్, బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News