గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఆగస్టు 17 నుండి ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం వార్డ్ సచివాలయాల వారీగా ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు, ప్రజారోగ్య అధికారులు, కార్మికులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి డిప్యూటీ కమిషనర్లు, హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ సూపర్వైజర్లతో ‘టాస్క్ ఫోర్స్ కమిటీ’ ని ఏర్పాటు చేశామన్నారు. ఆగస్ట్ 17 తర్వాత ఈ కమిటీ నగరంలో ప్లాస్టిక్ తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలు మరియు వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తుందన్నారు. ప్రత్యేక బృందాలతో నగరవ్యాప్తంగా గోడౌన్లు, హోల్సేల్, రిటైల్ దుకాణాలు మరియు వీధి వ్యాపారుల వద్ద తనిఖీలు నిర్వహించడం, నిషేధిత ప్లాస్టిక్ కనిపిస్తే వెంటనే ఆ సరుకును జప్తు చేసి, ‘స్వచ్ఛ గుంటూరు యాప్’ ద్వారా ఉల్లంఘనదారులపై అక్కడికక్కడే భారీ జరిమానాలు విధిస్తారన్నారు. నిబంధనలు పదే పదే ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే, ప్రజలు మరియు వ్యాపారుల్లో అవగాహన కల్పించేందుకు అన్ని వార్డుల్లో ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా, యువజన సంఘాలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే ప్రమాదాలు, ప్రత్యామ్నాయాలపై అవగాహన కల్పిస్తారన్నారు. కనుక నగర ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు ఆరోగ్యకరమైన, ప్లాసిక్ నిషేదిత గుంటూరు నగర సాకారానికి సహకరించాలని కోరారు.
Prajavartha Online Telugu News