గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3 పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో పట్టణ ప్రణాళిక, పబ్లిక్ హెల్త్, ఇరిగేషన్, ట్రాన్స్కో, సీపీడీసీఎల్ అధికారులతో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్-3 పనుల పురోగతిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇన్నర్ రింగ్ రోడ్ నగర ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు భవిష్యత్ రవాణా అవసరాలకు కీలకమైన మౌలిక సదుపాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. రహదారి విస్తరణకు అడ్డంకిగా ఉన్న పెండింగ్లోని 16 విద్యుత్ స్తంభాల మార్పిడి పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని ట్రాన్స్కో, సీపీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాల తొలగింపు, విద్యుత్ లైన్ల మార్పిడి పనులను వేగవంతం చేసి రోడ్డు నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్ఎస్పీ కాలువ వెడల్పు పెంపునకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులను ప్రారంభించాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. అలాగే, వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా హైటెన్షన్ విద్యుత్ లైన్ల ఎత్తు పెంచే పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్ విస్తరణకు ప్రభావితమైన స్థలాలకు సంబంధించి జీఎంసీ నుంచి పబ్లిక్ హెల్త్ శాఖకు అప్పగించాల్సిన పెండింగ్లో ఉన్న మూడు స్థలాల బదిలీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణ, స్థలాల అప్పగింత, యుటిలిటీల మార్పిడి వంటి అంశాల్లో ఎలాంటి ఆలస్యం జరగకుండా శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశాన్ని సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. పనుల నాణ్యతతో పాటు భద్రతా ప్రమాణాలను కూడా కచ్చితంగా పాటించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిర్వహణకు అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు.
Prajavartha Online Telugu News