-అమరావతి పుస్తకం కాదు… ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిరునామా -ఎంపీ చిన్ని
-అమరావతి గాథను దేశానికి చాటిన కాఫీ టేబుల్ బుక్
-కేంద్ర మంత్రి ఖట్టర్కు ‘అమరావతి’ పుస్తకం అందజేసిన ఏపీ కూటమి ఎంపీల బృందం
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్ర, ప్రజల పోరాటం, పునర్నిర్మాణ సంకల్పాన్ని ప్రతిబింబించే “అమరావతి: ప్రజలచే నిర్మించబడింది… విధిచే రక్షించబడింది” కాఫీ టేబుల్ బుక్ను కేంద్ర విద్యుత్, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మోహన్లాల్ ఖట్టర్ కు ఏపీ కూటమి ఎంపీల బృందం మర్యాదపూర్వకంగా అందజేసింది. ఈ బృందంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) కూడా పాల్గొన్నారు.
బుధవారం పార్లమెంట్ లోని మంత్రి ఖట్టర్ కార్యాలయం లో ఆయనను కలిసి అమరావతి నిర్మాణ గాథను ప్రతిబింబించే ఈ కాఫీ టేబుల్ బుక్ను అందించింది.ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) మాట్లాడుతూ, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం, రైతులు–మహిళలు సాగించిన 1,631 రోజుల ఉద్యమం, అలాగే 2024 జూన్ 2న అమరావతిని రాష్ట్ర రాజధానిగా పునరుద్ధరించిన చారిత్రక నిర్ణయం వంటి అంశాలను ఈ పుస్తకం కళ్లకు కట్టినట్లు వివరిస్తుందని తెలిపారు.అమరావతి మరపురాని పోరాటం ప్రతి భారతీయుడుతెలుసుకోవాల్సిన చరిత్ర! అని,”అమరావతి పుస్తకం కాదనీ,ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిరునామా!” అని కొనియాడారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా, సంపద సృష్టి, ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ఎంపీల బృందం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చిన్ని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను దేశ నాయకత్వానికి వివరించేందుకు ఇటువంటివి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. విజయవాడ ప్రాంతంలోని పలు సమస్యలను సైతం కేంద్రమంత్రి ఖట్టర్ దృష్టికి ఎంపి చిన్ని తీసుకువెళ్లారు దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు
Prajavartha Online Telugu News