-హంద్రీనీవా పరిధిలో 13 టిఎంసిలు అవసరం
-2027 జూన్ వరకు శ్రీశైలం జాలలను తాగునీటి కోసం భద్రపరచుకోవాలి.
-కలెక్టర్లు, ఇరిగేషన్, రెవిన్యూ, అగ్రికల్చర్ శాఖలు సమన్వయం చేసుకోవాలి.
-జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంల రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో భాగంగానే రాయలసీమ ప్రాంత తాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు నీటి విడుదల చేపడుతున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 119 టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా, రానున్న పది రోజుల్లో మరో 100 టీఎంసీల వరకు ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు. ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం భద్రపరిచే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్కు ఉన్న 63 శాతం వాటాలో తొలి ప్రాధాన్యత తాగునీటికే ఇస్తున్నట్లు చెప్పారు. హంద్రీనీవా పరిధిలోని రిజర్వాయర్ల తాగునీటి అవసరాల కోసం 13 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు 10 టీఎంసీల నీటిని రేపటి నుంచి విడుదల చేయనున్నామని తెలిపారు.
అలాగే, తెలుగుగంగ ద్వారా చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలోని తాగునీటి అవసరాల కోసం 32 టీఎంసీల నీరు అవసరమని అన్నారు. ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి వారం పరిస్థితిని సమీక్షిస్తూ, వర్షపాతం, వరదల పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించామని అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో తాగునీటి భద్రతకు చర్యలు చేపట్టాలని సూచించారు.
Prajavartha Online Telugu News