-న్యాయ కార్యదర్శిని ఆదేశించిన న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
-న్యాయవాదుల రక్షణకు, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం- మంత్రి ఫరూక్ స్పష్ఠీకరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ బిల్లు-2026( ఏపీ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ -2026)ను రూపొందించడానికి కూటమి ప్రభుత్వం కార్యాచరణ చర్యలకు ఉపక్రమించింది.
ముసాయిదాను వీలైనంత త్వరగా తయారు చేయాలని న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవికి న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికార యంత్రాంగం తో యుద్ధ ప్రాతిపదికన చర్చించి ముసాయిదా రూపకల్పనకు కార్యాచరణ చేపట్టాలని న్యాయశాఖ కార్యదర్శి కి సూచన చేసినట్లు మంత్రి ఫరూక్ బుధవారం అమరావతి లో విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ముసాయిదా బిల్లు తయారైన వెంటనే తదుపరి చర్యల కోసం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తో పాటు ఆర్థిక శాఖ రిమార్కులను పరిగణలోకి తీసుకొని బిల్లు ఆమోదం కోసం మంత్రి మండలి సమావేశం ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని మంత్రి తెలిపారు.న్యాయవాదు ల సంక్షేమానికి, రక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరణించిన 1173 మంది న్యాయవాదుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు ప్రకారం మొత్తం రూ. 46.92 కోట్లు ఆర్థిక సాయం ను కూటమి ప్రభుత్వం విడుదల చేసిన విషయాన్ని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు.
Prajavartha Online Telugu News