విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగర ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఉత్పత్తి కాకుండా, డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఖాళీ స్థలాల్లో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలకు అనుగుణంగా ప్రజారోగ్య విభాగం అధికారులు నగరవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత వారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నగరంలోని అన్ని వార్డుల్లో ఉన్న ఖాళీ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాలు, పొదలు, మురుగును తొలగించడంతో పాటు నిల్వ ఉన్న నీటిని తొలగించే చర్యలు చేపట్టారు.
పరిశీలనలో భాగంగా ఖాళీ స్థలాల యజమానులు గుర్తించిన చోట వారికి నోటీసులు జారీ చేసి, తమ స్థలాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, చెత్త పేరుకుపోకుండా, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని భంగం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో ఆరు జేసీబీలు, పారిశుధ్య కార్మికులు, ప్రజారోగ్య సిబ్బంది సమన్వయంతో విస్తృతంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి విజయవంతంగా పూర్తి చేశారు. దోమల ఉత్పత్తికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా శుభ్రపరిచారు. ఖాళీ స్థలాల పరిసర ప్రాంతాల ప్రజలకు అక్కడ చెత్త, వ్యర్థాలు వేయకుండా ఉండాలని అధికారులు అవగాహన కల్పించారు. ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు వేయడం వల్ల దోమలు విస్తృతంగా వృద్ధి చెంది, వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా తమ కుటుంబంతో పాటు సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని సూచించారు.
Prajavartha Online Telugu News