-జీరో వేకెన్సీ కింద ఖాళీల భర్తీ కోసం సీఎంతో చర్చిస్తా
-రూ.210 కోట్లతో ధర్మవరం, పిఠాపురంలలో ఆయుర్వేద వైద్య కళాశాలలు, ప్రొద్దుటూరులో యునాని కళాశాల ఏర్పాటుకు స్థల సేకరణ పూర్తి
-రూ.90 కోట్లతో ఆరు చోట్ల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు చర్యలు
-వైద్యుల సదస్సులో రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఆయుష్ శైద్య సేవల విస్తృతికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఈ క్రమంలోనే ఆయుష్ సేవల అభివృద్ధి కోసం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.257 కోట్లు మంజూరు చేయాలని వార్షిక ప్రణాళిక కింద నేషన్ ఆయుష్ మిషన్ కు ప్రతిపాదన పంపించామని తెలిపారు. అలాగే వైద్యారోగ్య శాఖలో మాదిరిగానే ఆయుష్ , ఫుడ్ సేఫ్టీ శాఖల్లో జీరో వేకేన్సీ కింద నియామకాలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుతో చర్చిస్తామని వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో గురువారం ప్రభుత్వ ఆయుర్వేద, హోమియో , యునాని, సిద్ధ వైద్యులకు రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ జాతీయ ఆయుష్ కమిషన్ నుంచి వార్షిక ప్రణాళిక కింద నిధులు పొందడంలో ఆనాటి గత వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. 2024-25లో రూ.85 కోట్లు, 2025-26లో రూ.166 కోట్లు చొప్పున కూటమి ప్రభుత్వానికి మంజూరయ్యాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ భారీగా కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని చెప్పారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లతో గుంటూరు సమీపంలో కేంద్ర యోగా, ప్రకృతి వైద్యానికి సంబంధించిన పరిశోధన సంస్థను ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం 15 ఎకరాలను కేటాయించిందని చెప్పారు. గత ప్రభుత్వం ఈ సంస్థ ఏర్పాటు కోసం కేటాయించిన భూమిని ఇళ్ల స్థలాలకు మళ్లించడంతో తదుపరి చర్యలు స్తంభించాయని విమర్శించారు.
అవగాహన కల్పించిన అనంతరమే ఆయుర్వేదలో శస్త్ర చికిత్సలు
తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి, రంపచోడవరంలలో ఒక్కొక్కటి రూ. 15 కోట్లు చొప్పున వ్యయం చేసి సమగ్ర ఆయుష్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. ధర్మవరం, పిఠాపురంలలో ఆయుర్వేద, ప్రొద్దుటూరులో యునాని వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.70 కోట్లు చొప్పున రూ.210 కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. అలాగే విశాఖలోరూ.70 కోట్లతో తలపెట్టిన నేచురోపతి వైద్య కళాశాల నిర్మాణం పనులు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. అలాగే ఆయుష్ ఆరోగ్య మందిరాలకు పూర్తిస్థాయిలో కొత్త భవనాలను నిర్మించే పనులు చివరిదశకు వచ్చాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు వివిధ హోదాల్లో కలిపి 216 మంది ఆయుష్ వైద్యులను నియమించిందన్నారు. ఆయుర్వేదంలోని శల్యతంత్ర, శాకల్యతంత్ర విభాగాలకు సంబంధించి 58 రకాల శస్త్ర చికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని మంత్రి తెలిపారు. సంబంధిత వర్గాలతో చర్చించి, ఈ చికిత్స విధానాలపై పూర్తి అవగాహన కల్పించిన తర్వాత అమలు చేస్తామని చెప్పారు. ఆయుష్కు ప్రాధాన్యతనివ్వడమంటే అల్లోపతి వైద్యాన్ని తగ్గించడం కాదని మంత్రి స్పష్టం చేశారు. అత్యవసర చికిత్స, శస్త్ర చికిత్సల్లో అల్లోపతి వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం, యోగా, ప్రకృతి వైద్య విధానాలను అవలంబించడం వల్ల వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చెప్పారు.
రోగుల వివరాలు డిజిటలీకరణ
సదస్సు ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ మాట్లాడతూ, ముగింపు కార్యక్రమంలో రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఆయుష్ వైద్య కేంద్రాలను ఎహెచ్ ఎంఐయస్ పోర్టల్ తో అనుసంధానం చేశామని, ఇప్పటికే 60,000 మంది రోగుల వివరాలను నమోదు చేశామన్నారు. రోగుల పేర్ల నమోదు మొదలుకొని మందుల పంపిణీ వరకు అన్ని సేవలను ఒక డిజిటల్ వేదికపై నిర్వహించేలా వ్యవస్థను పటిష్టం చేవామని చెప్పారు. గడచిన రెండేళ్లల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆయుష్ సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఈ సదస్సు మరింత ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆయుర్వేద కొత్త వైద్య క
ళాశాలలు, ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్దం చేశామని చెప్పారు.
చికిత్సల్లో ప్రమాణాలు పాటించాలి
కేంద్ర ప్రభుత్వ హోమియోపతి సలహాదారు డాక్టర్ ప్రీతా కిజక్కుట్టిల్ మాట్లాడుతూ హోమియో వైద్య శాలల్లో ఒకే విధమైన చికిత్సా ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఈ సదస్సులో ఆయుష్ అదనపు డైరెక్టర్లు శేఖర్, సాయిసుధాకర్, డిప్యూటీ డైరెక్టర్ ధనుంజయరావు, ఇతర అధికారులు మాట్లాడిన వారిలో ఉన్నారు. ఆయుష్ వైద్యులు 550 మంది హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో ఇటువంటి సదస్సు జరగడం ఇదే తొలిసారి
Prajavartha Online Telugu News