– నో-బిడ్స్ మరింత తగ్గాలి.. రైతులకు మెరుగైన ధర దక్కేలా చర్యలు చేపట్టాలి
– పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో తాజా పరిస్థితిపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎఫ్సీవీ (FCV) పొగాకు వేలాలు, కొనుగోళ్ల తాజా పరిస్థితిపై మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పొగాకు బోర్డు సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొనుగోళ్ల వేగం పెరగడం, నో-బిడ్ శాతం క్రమంగా తగ్గుతుండటం సానుకూల పరిణామమని పేర్కొన్న మంత్రి, ఇదే వేగాన్ని కొనసాగిస్తూ రైతులకు మరింత మెరుగైన ధర లభించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు 117 వేలాలు పూర్తయ్యాయని, సుమారు 60 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు జరిగిందని, ప్రస్తుతం సగటు ధర కిలోకు సుమారు రూ.210 వద్ద కొనసాగుతోందని అధికారులు మంత్రికి వివరించారు. ఇటీవల రోజుల్లో కొనుగోళ్లు వేగం పుంజుకుని రోజుకు సగటున 1.5 నుంచి 2 మిలియన్ కిలోల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. అదే సమయంలో నో-బిడ్ శాతం క్రమంగా తగ్గుతూ రావడం రైతులకు ఊరటనిచ్చే పరిణామమని మంత్రి పేర్కొన్నారు.
పొగాకు రైతుల ప్రయోజనాలే ప్రాధాన్యంగా కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పొగాకు కొనుగోలు కంపెనీలు, ట్రేడర్లతో మరోసారి చర్చించి కొనుగోళ్ల పరిమాణాన్ని పెంచాలని, ‘నో-బిడ్స్’ను మరింత తగ్గించాలని పొగాకు బోర్డు అధికారులకు సూచించారు. ముఖ్యంగా రైతులకు లభిస్తున్న సగటు ధర మరింత పెరిగేలా కంపెనీలు, ట్రేడర్లతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పొగాకు రైతులు ఇబ్బందులు పడకుండా వేలాలు, కొనుగోళ్ల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు మెరుగైన ధర దక్కేలా పొగాకు బోర్డు, కొనుగోలు కంపెనీలు, ట్రేడర్లతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News