-పకడ్బందీగా 33 శాతం గ్రీన్ కవర్ ప్రణాళికలు
-ఆచరణలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు
-మొదటి దశలో 26 పరిశ్రమల్లో 14 రోజుల ప్రత్యేక కార్యచరణ
-129 ఎకరాల్లో 43,300 మొక్కలు నాటిన పారిశ్రామిక వర్గాలు
-మిగిలిన పరిశ్రమల్లో కట్టుదిట్టంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి దిశా నిర్దేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశ్రామిక ప్రగతితోపాటు పర్యావరణ పరిరక్షణకు సమ ప్రాధాన్యమివ్వాలన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలు కార్యరూపం దాలుస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే మూల సిద్ధాంతాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి ద్వారా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ప్రతి పరిశ్రమ తన పరిధిలోని భూభాగంలో 33 శాతం పచ్చదనంతో నింపాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేసే విధంగా రూపొందించిన ఈ ప్రణాళిక ఫలితాన్నిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మొదటి దశలో జిల్లాకు ఒకటి చొప్పున పరిశ్రమను ఎంపిక చేసి రెండు వారాల్లో గ్రీన్ కవర్ లక్ష్యాలను చేరుకునేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జులై 28వ తేదీన ప్రారంభమైన ఈ డ్రైవ్ ఆగస్టు 11వ తేదీ నాటికి ముగిసింది. 26 జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన 26 పరిశ్రమలు నిర్దేశిత లక్ష్యాన్ని కేవలం 14 రోజుల్లో సాధించాయి. మొత్తం 129 ఎకరాల విస్తీర్ణంలో 43,300 మొక్కలు నాటారు. స్థానిక వాతావరణ పరిస్థితులు, నేల సారం ఆధారంగా అనువైన దేశీయ జాతులతోపాటు పండ్ల మొక్కలు, సుందరీకరణకు ఉపయోగించే మొక్కలు, వేప, కానుగ, రావి, నేరేడు తదితర జాతులకు ప్రాధాన్యత ఇచ్చారు.
భారీ పరిశ్రమలు విడుదల చేసే వాయు కాలుష్యాన్ని హరించి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి అందించే సంకల్పాన్ని పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకువెళ్తున్నారు. పరిశ్రమల ఉత్పాదకత, ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా పర్యావరణ సమతుల్యత పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగం పుంజుకున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకతను చాటి చెబుతున్నారు. తొలి దశ 33 శాతం గ్రీన్ కవర్ విజయవంతంగా పూర్తి కావడంతో ఈ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో కట్టుదిట్టంగా అమలు చేస్తూ, రాష్ట్రంలో మిగిలిన పరిశ్రమలు కూడా గ్రీన్ కవర్ లక్ష్యంలో భాగస్వాములయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశా నిర్దేశం చేశారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్–2047 విజన్లో భాగంగా రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి శాఖ, ప్రతి పరిశ్రమ, బాధ్యతాయుతంగా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News