తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న 2వ సాధారణ ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠా ఆధ్వర్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి సుశీలా దేవితో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లు, ఎన్నికలకు ముందు నిర్వహించాల్సిన ప్రక్రియలు, పోలింగ్ కేంద్రాల తనిఖీలు, ఎన్నికల సామగ్రి లభ్యత తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 807 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 16 పంచాయతీలు కోర్టు కేసులకు సంబంధించిన అంశాల కారణంగా ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని, మిగిలిన 791 గ్రామ పంచాయతీలకు నోటీసుల ప్రచురణ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల మార్కింగ్తో పాటు ఎన్నికలకు ముందు నిర్వహించాల్సిన ఇతర ప్రక్రియలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు సుమారు 40 శాతం మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు. అలాగే జిల్లాలోని పోలింగ్ కేంద్రాల తనిఖీ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయిందని, నిర్ణయించిన గడువు నాటికి మిగిలిన ప్రక్రియలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు తదితర ఎన్నికల సామగ్రి కొరతపై కూడా సమావేశంలో చర్చించారు. అవసరమైన సామగ్రి కోసం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇండెంట్ పంపినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో కొనుగోలు చేయాల్సిన సామగ్రి, రాష్ట్ర స్థాయి నుంచి సమకూర్చే సామగ్రిపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించాలని కోరారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా స్థాయిలో ఎన్నికల సామగ్రి సమీకరణకు సంబంధించి స్పష్టమైన కమ్యూనికేషన్ను త్వరలో జారీ చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, సంబంధిత సీనియర్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులతో సమన్వయం కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమాచారాన్ని వేగంగా పరస్పరం పంచుకోవాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై కూడా సమీక్షించారు. జిల్లాలో 6 పట్టణ స్థానిక సంస్థలు (ULBs) ఉన్నాయని, వాటిలో శ్రీకాళహస్తి పట్టణ స్థానిక సంస్థకు సంబంధించిన అంశాలపై ప్రస్తుతం ముందుకు వెళ్లే పరిస్థితి లేదని, మిగిలిన పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని అధికారులు వివరించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి 68 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు గత డిసెంబర్లో సమర్పించిన ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్న విషయాన్ని కూడా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వ స్థాయిలో సమీక్ష జరుగుతోందని, అనంతరం జిల్లాకు సమాచారం అందిస్తామని రాష్ట్ర స్థాయి అధికారులు తెలిపారు.
విలీన ప్రక్రియకు సంబంధించి తుది నిర్ణయం వచ్చే వరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాల్లో స్పష్టతతో ముందుకు సాగాలని, ఒకవేళ ఏదైనా కారణంగా విలీనం ప్రక్రియ పూర్తికాకపోతే సంబంధిత గ్రామ పంచాయతీలు తమ పరిధిలో ఎన్నికలను నిర్వహించుకునే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News