విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలోని బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రూ.23.15 లక్షల రుణాలను లబ్ధిదారులకు మంజూరు చేసి అందజేశారు. గొల్లపూడిలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం 2014లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్రాహ్మణుల సంక్షేమానికి తొలిసారిగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో రూ.25 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. బ్రాహ్మణుల ఆర్థిక సామాజిక అభివృద్ధికి దోహదపడేలా 2015లో బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసినందుకు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన కృషికి గుర్తుగా రుణ మంజూరు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే సొసైటీ ప్రధాన లక్ష్యమని బుచ్చిరామ్ ప్రసాద్ తెలిపారు. తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తూ చిన్న వ్యాపారాలు విద్య వైద్యం తదితర అవసరాలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పారదర్శకంగా రుణాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. బ్రాహ్మణ సంక్షేమ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా విద్య ఉపాధి ఆరోగ్యం ఆలయాల అభివృద్ధి తదితర రంగాల్లో పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రుణాల ద్వారా లబ్ధిదారుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక సహాయ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. బ్రాహ్మణ సమాజ అభివృద్ధికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు వెలగలేటి గంగాధర్, పీవీ ఫణికుమార్, ఆకెళ్ల వెంకటనారాయణ మూర్తి, విజయవాడ బ్రాహ్మణ ప్రముఖులు శివశర్మ, గార్లపాటి విజయకుమార్, కిషోర్ పలువురు బ్రాహ్మణులు రుణ లబ్ధిదారులు పాల్గొన్నారు. సంస్థ సీఈఓ జి.నాగసాయి, విజయవాడ మేనేజర్ శ్రీనివాస్ సిబ్బంది హాజరయ్యారు.
Prajavartha Online Telugu News