విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిట్టినగర్లోని శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానానికి 25 ఏళ్ల తర్వాత నూతన పాలక మండలి ఏకగ్రీవంగా ఎన్నికైంది. కుల పెద్దలు వివిధ సంఘాల సమన్వయంతో 25 మంది సభ్యులతో నూతన పాలక మండలిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 46వ డివిజన్లోని రాకేష్ పబ్లిక్ స్కూల్ సెమినార్ హాల్లో నూతన పాలక మండలి సభ్యుల ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షుడు నల్లాన సూర్యారావు, అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు.
యువతకు ప్రాధాన్యత ఆలయ అభివృద్ధికి కృషి
ఈ సందర్భంగా నల్లాన సూర్యారావు, మాట్లాడుతూ నూతన పాలక మండలిలో యువతకు కొత్త తరానికి ప్రాధాన్యత కల్పించడం శుభపరిణామమన్నారు. నూతన ఉత్సాహంతో కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులను త్వరితగతిన పొందడంతో పాటు కళ్యాణ మండపాన్ని ఆధునీకరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
భక్తిశ్రద్ధలతో సేవలందిస్తాం…
నూతన పాలక మండలి అధ్యక్షుడు పోతిన బేసికంటేశ్వరుడు, మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీతారామచంద్ర మహాలక్ష్మి అమ్మవారు పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారికి భక్తిశ్రద్ధలతో సేవలందిస్తామని చెప్పారు. ఆలయ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో ఆలయ ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్.వి.రావు శీరం వెంకట్రావు బెవర శ్రీనివాసరావు తదితర నగరాల సంఘం పెద్దలు పాల్గొని నూతన పాలక మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు…
Prajavartha Online Telugu News