-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యా రంగంలో జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే తలమానికమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముత్యాలంపాడులోని గొట్టిముక్కల సూర్యనారాయణ రాజు ప్రభుత్వ పాఠశాలలో 500 మంది విద్యార్థులకు సోమవారం ఆయన జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. గత ప్రభుత్వంలో విద్యాలయాలు శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతాయో తెలియని దయనీయ పరిస్థితులలో ఉండేవని.. కానీ నేడు సకల వసతులతో కళకళలాడుతున్నాయన్నారు. అమ్మఒడి, నాడు–నేడు కింద మౌలిక వసతుల కల్పన, గోరుముద్ద, విద్యాకానుక, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్.. ఇలా చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం చేయగలిగినంతా సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారన్నారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం రోజున ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా విప్లవానికి నాంది పలుకుతూ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగపరచుకుని.. ప్రతి ఒక్క విద్యార్థి చదువులో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జి.పుష్ప, ఎలిమెంటరీ స్కూల్ ప్రిన్సిపల్ పరమేష్, నాయకులు పెనుమత్స రాజు, మానం వెంకటేశ్వరరావు, గోవింద్, బెజ్జం రవి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News